భారత్లో ఎన్నికలు: జీఎస్పీపై తర్వాత నిర్ణయం తీసుకోండి.. ట్రంప్కు సెనేటర్లు
వాషింగ్టన్: భారత్కు ఉన్న వాణిజ్య ప్రాధాన్యతా హోదాపై (జీఎస్పీ - జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్) సమీక్ష నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఇద్దరు అమెరికన్ సెనేటర్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు విజ్ఞప్తి చేశారు. భారత్లో ప్రస్తుతం లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో అవి ముగిసేవరకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) రాబర్ట్ లైథీజర్కు సెనేటర్లు లేఖ రాశారు. ఈ లేఖలో రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ జాన్ కార్నిన్, డెమోక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ మార్క్ వార్నర్లు సంతకాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇలాంటి నిర్ణయాలు భారత్ - అమెరికా వ్యాపార సంబంధాలపై పడతాయని భావించారు. భారత్లో మే 23వ తేదీ వరకు సార్వత్రిక ఎన్నికలు ఉన్న విషయం మీకు తెలిసిందేనని సెనేటర్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
జీఎస్పీ.. అమెరికాకు చెందిన అతిపెద్ద, ఎన్నో సంవత్సరాల నాటి ట్రేడ్ ప్రిఫరెన్స్ ప్రోగ్రామ్. ఆర్థికంగా వెనుకబడిన దేశాల అభివృద్ధి కోసం అమెరికా అనుసరిస్తున్న వాణిజ్య సహకార పథకమే జీఎస్పీ. ఈ పథకంలో ఉన్న దేశాలు ఎలాంటి పన్నులు లేకుండానే అమెరికాకు తమ ఎగుమతులు చేసుకోవచ్చు. అయితే ఈ పథకం నుంచి భారత్ను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెల నిర్ణయం తీసుకున్నారు. దీంతో సెనేటర్లు ఈ లేఖ రాశారు.