రాహుల్ గాంధీ ప్రకటించిన 'న్యాయ్' స్కీం ఏమిటి, ఎవరికి లాభం?
తమ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు న్యాయ్ (NYAY) పథకాన్ని తీసుకు వస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ న్యాయ్ స్కీం ఏమిటి? ఎవరికి ఇస్తారు? ఎంత ఇస్తారు? ఈ పథకం సాధ్యమైనా? అనే చర్చ సాగుతోంది. రాహుల్ సోమవారం ప్రకటించిన మినిమం ఇన్కం గ్యారెంటీ పథకమే న్యాయ్ స్కీం.
రాహుల్ గాంధీ రూ.72వేలకు మోడీ ప్రభుత్వం రూ.1,06,800 కౌంటర్
5 కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ.72వేలు బ్యాంకులో వేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. దేశంలో 20 శాతం మంది నిరుపేదలు ఉన్నారని చెప్పారు. నిరుపేదలపై ఇది చివరి పోరాటం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. నెహ్రూ నుంచి మొదలు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దాకా అందరూ గరీబీ హఠావో అంటున్నారని, కానీ కాంగ్రెస్ చేసిందేమీ లేదనే విమర్శల నేపథ్యంలో పేదరికంపై ఇది చివరి పోరాటం అన్నారు. ఈ పథకాన్ని హిందీలో న్యుంతమ్ ఆయ్ యోజన (మినిమమ్ ఇన్కం స్కీం) అని అంటారు. దీనికి అర్థం జస్టిస్. దీనిని చిన్నగా NYAY (ఎన్వైఏవై)గా పిలుస్తున్నారు.
న్యాయ్ పథకం సాధ్యమేనా?
న్యాయ్ పథకం సాధ్యమేనా అనే చర్చ సాగుతోంది. దేశంలో 20 శాతం మంది పేదలు పేద ప్రజలు ఉన్నారని, వారిని కుటుంబాలపరంగా లెక్కిస్తే ఐదు కోట్ల కుటుంబాలు అవుతాయని, ప్రతి కుటుంబం జీవించాలంటే నెలకు కనీసం రూ.12 వేల రూపాయలు అవసరమని, ప్రస్తుతం చాలామందికి నెలకు రూ.6 వేల ఆదాయమే వస్తోందని, అలాంటి వారికి తాము అధికారంలోకి వస్తే నెలకు నేరుగా ప్రతి పేద కుటుంబం ఖాతాలో నెలకు రూ.6 వేలు జమ చేస్తామన్నారు. తద్వారా ప్రతి కుటుంబానికి కనీస ఆదాయం రూ.12వేలుగా ఉండేలా చూస్తామన్నారు.
దేశంలో 5 కోట్ల కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.72వేలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. దీంతో ఈ మొత్తం రూ.3.6 లక్షల కోట్లు అవుతుంది. ఇది ప్రభుత్వానికి బర్డెన్ అంటున్నారు. ఏడాది బడ్జెట్లో 12 నుంచి 13 శాతం, అలాగే డీజీపీలో 2 శాతం వాటాకు సమానం.
ఏడాదికి ద్రవ్యలోటు జీడీపీలో 3.3 శాతానికి మించకూడదని కేంద్రప్రభుత్వం పరిమితి విధించుకుంది. ఇప్పటికే ద్రవ్యలోటు 3.4 శాతానికి చేరుకుంది. అలాంటప్పుడు జీడీపీలో రెండు శాతం అంటే రూ.3.6 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు రాహుల్ గాంధీ నుంచి గానీ, ఆ పార్టీ సీనియర్ నాయకుల నుంచిగానీ సరైన సమాధానం లేదని అంటున్నారు. అలాగే, ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం ఉంటుందంటున్నారు.
ఈ స్కీం ప్రకటన ఎన్డీయే ప్రభుత్వానికి దెబ్బే అంటున్నారు. గతంలో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో రైతులకు రుణమాఫీ కూడా ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఈ పథకంపై కాంగ్రెస్ పార్టీ బాగా ప్రచారం చేస్తే, ప్రజల్లోకి బాగా తీసుకెళ్తే లాభం ఉంటుందని చెబుతున్నారు. రైతులు, పేదలను ఇది ఆకర్షిస్తుందని అంటున్నారు. ఈ స్కీం సాధ్యం కాకపోవచ్చునని కొందరు చెప్పడంతో పాటు కొందరిని పని చేయని విధంగా మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే, ప్రజలు ఏం చేస్తారో చూడాలి. ఎన్డీయేకి తిరిగి అధికారం ఇస్తారా లేక ఈ పథకంతో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంటుందా మే 23న తెలుస్తుంది.