బంపరాఫర్: మెగా ఇష్యూ.. కొద్దిరోజుల్లో వొడాఫోన్-ఐడియా 62 శాతం భారీ డిస్కౌంట్! ఎందుకంటే
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజం వొడాఫోన్ - ఐడియా పెద్ద ఎత్తున నిధుల సేకరణకు బోర్డు గ్రీన్ సిగ్నల్ తెలిపింది. రైట్ ఇష్యూ ద్వారా రూ.25 వేల కోట్లను సేకరించాలని గతంలోనే ఈ కంపెనీ నిర్ణయించింది. ఈక్విటీ షేరు ధరను రూ.12.50గా నిర్ణయించింది. ప్రస్తుత స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రకారం చూస్తే బుధవారం షేర్ ముగింపు ధర కంటే 61 నుంచి 62 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. నిన్న (మార్చి 20) వొడాఫోన్ ఐడియా ధర రూ.33 వద్ద ముగిసింది. ఈ ధరతో పోల్చుకుంటే 62 శాతం వరకు తక్కువ.
ఆసియాలో వరస్ట్ నుంచి బెస్ట్ కరెన్సీ: రూపాయి బలపడటానికి కారణమేమిటి?
10 నుంచి 24 మధ్య రైట్స్ ఇష్యూ
ఇందుకు వొడాఫోన్-ఐడియా కంపెనీ రెండు వేల కోట్ల కొత్త షేర్లను జారీ చేయనుంది. వచ్చే నెల 10 నుంచి 24వ తేదీ వరకు (ఏప్రిల్) ఈ ఇష్యూ కొనసాగనుంది. ఇప్పటికే 38 షేర్లు ఉన్న వాటాదారులు కొత్తగా 87 షేర్లను కొనుగోలు చేయవచ్చు. రైట్ ఇష్యూ ద్వారా రూ.25 వేల కోట్ల నిధులు సేకరించాలని నిర్ణయించింది. ప్రతిపాదిత రైట్స్ ఇష్యూలో ఒక్కో ఈక్విటీ షేర్ (రూ.10 ముఖ విలువ) ధరను రూ.12.50కు జారీ చేయడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో 4జీ పరిధిని మరింత విస్తరించడం, 5జీ సేవలు అందించేందుకు ఉపయోగించనుంది.
2వేల కోట్ల కొత్త ఈక్విటీ షేర్లు జారీ చేయనుంది
రైట్స్ ఇష్యూకు రికార్డ్ డేట్గా ఏప్రిల్ 2వ తేదీని నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఏప్రిల్ 2వ తేదీలోపు ఎవరి దగ్గర అయితే వొడాఫోన్ - ఐడియా షేర్లు ఉంటాయో వారికి మాత్రమే ఈ రైట్స్ ఇ,్యూలో షేర్లు పొందేందుకు అర్హత ఉంటుంది. ప్రతి 38 ఈక్విటీ షేర్లకు కొత్తగా 87 షేర్లను ఇస్తారు. రైట్స్ ఇష్యూ ఏప్రిల్ 10వ తేదీ నుంచి మొదలై పదిహేను రోజులు తర్వాత ముగుస్తుంది. ఈ రైట్స్ ఇష్యూలో ప్రమోటర్ సంస్థలు వొడాఫోన్ గ్రూప్ రూ.11 వేల కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.7,250 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేయనున్నాయి. రైట్స్ ఇష్యూలో భాగంగా ఈ కంపెనీ 2వేల కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది.
జియో నుంచి పోటీని తట్టుకోవడానికే
రిలయన్స్ జియో నుంచి పోటీ ఎదురవుతున్న నేఫథ్యంలో ఈ పోటీని తట్టుకోవడానికి వొడాఫోన్ - ఐడియా భారీ ఎత్తున పెట్టుబడులకు సిద్ధమైంది. రైట్స్ ఇష్యూలో భాగంగా వచ్చే నిధులతో ఆర్థికంగా మరింత పుంజుకొని రిలయెన్స్ జియోకు గట్టి పోటీ ఇవ్వగలదని అంచనా వేస్తున్నారు. రుణభారం తగ్గించుకునేందుకు కూడా రైట్స్ ఇష్యూ నిధులను ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. డిసెంబర్ 31, 2018 నాటికి కంపెనీ రూ.1,23,660 కోట్ల స్థాయిలో అప్పు ఉంది. ఈ జాయింట్ వెంచర్లో వొడాఫోన్కు 45.1 శాతం వాటా ఉంది. ఆదిత్యా బిర్లా గ్రూప్కు 26 శాతం, ఐడియా వాటాదారులకు 28.9 శాతం వాటా ఉంది.