ప్రావిడెంట్ ఫండ్పై సుప్రీం కోర్ట్ సెన్సేషనల్ తీర్పు ! ఉద్యోగులూ తప్పక చూడండి
ప్రావిడెండ్ ఫండ్.. ఇది రిటైర్మెంట్ టైంలో ఖచ్చితంగా పనికొచ్చే ఓ అద్భుత సాధనం. పెద్ద వయస్సులో అత్తెసరు పెన్షన్లపైనో, మరెవరిపైనో ఆధారపడకుండా పెద్ద మొత్తం చేతికి అందేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోషల్ సెక్యూరిటీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యోగులకు దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ చాలా సంస్థలు దీన్నో గుదిబండలా ఫీలవుతాయి. ఉద్యోగుల తరపున, ఉద్యోగుల కోసం డబ్బులు నెలనెలా చెల్లించేందుకు తెగ ఫీలవుతాయి. దీన్ని ఎగ్గొట్టేందుకు ఉన్న అన్ని మార్గాలనూ అన్వేషిస్తాయి. బేసిక్ శాలరీని తక్కువ చూపించడం, స్పెషల్ అలొవెన్స్ పేరుతో విడగొట్టం వంటివి చేస్తూ ఉంటాయి. అయితే దీనిపై సుప్రీం కోర్ట్ సీరియస్ అయింది. పీఎఫ్పై తీర్పును వెలువరించింది.
ఏంటా తీర్పు సారాంశం
తాజాగా సుప్రీం కోర్ట్ పీఎఫ్ విషయంలో క్లారిటీ ఇచ్చింది. కన్వేయెన్స్, ఎడ్యుకేషన్ సహా ఇతర ప్రత్యేక అలవెన్సులను కూడా బేసిక్ శాలరీ కిందే పరిగణించాలని తేల్చిచెప్పింది. ఇది ఎంప్లాయర్స్కు చెంప పెట్టులాంటి తీర్పు. ఎందుకంటే ఇంతకాలం కార్పొరేట్ సంస్థలు పీఎఫ్ బాధ తప్పించుకునేందుకు, తక్కువ కట్టేందుకు అనేక మార్గాలను అన్వేషించేవి. ఇప్పుడు వాటికి బ్రేక్ వేయకతప్పదు.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952 కింద బేసిక్ శాలరీలో 12 శాతం పీఎఫ్ కింద డిడక్ట్ చేయాలి. రూ.15000 లోపు బేసిక్ శాలరీ ఉన్న వాళ్లందరికీ తప్పకుండా పీఎఫ్ కట్ చేయాలి. అదే సమయంలో ఎంప్లాయర్ కూడా అంతే మొత్తాన్ని పీఎఫ్లో జమ చేయాలి. ఉదాహరణకు నెలకు ఉద్యోగి జీతం నుంచి రూ.1800 పీఎఫ్ కింద వసూలు చేస్తే.. అంతే మొత్తాన్ని ఎంప్లాయర్ కూడా జత చేసి మొత్తం రూ.3600ను నెలకు పీఎఫ్ సంస్థకు చెల్లించాలి. ఈ కార్పస్ డబ్బును ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలోనో లేకపోతే ఉద్యోగం నుంచి వైదొలిగినప్పుడో తీసుకోవచ్చు.
రూ.15000లోపు బేసిక్ ఉన్నవాళ్లకు ఎఫెక్ట్
తాజా సుప్రీం తీర్పు నేపధ్యంలో రూ.15000 బేసిక్ శాలరీ ఉన్నవాళ్లందరికీ ఎఫెక్ట్ ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం ఓ ఉద్యోగి జీతం ఏడాదికి రూ.3 లక్షలు అనుకుందాం. ఇందులో బేసిక్ 40 శాతం తీసుకుంటే నెలకు రూ.10 వేలు అవుతుంది (ఏడాదికి రూ.1.20 లక్షలు). దీనిపై నెలకు పీఎఫ్ కంట్రిబ్యూషన్ ఉద్యోగి రూ.1200, ఎంప్లాయర్ రూ.1200 కట్టాలి. మొత్తం సొమ్ము రూ.2400 అవుతుంది.
ఇప్పుడెంత ఎఫెక్ట్
తాజా సుప్రీం తీర్పుతో పీఎఫ్ క్యాలికులేషన్ కొద్దిగా మారొచ్చు. ఇప్పుడు నెలకు రూ.10వేల బేసిక్ కాస్తా రూ.15 వేలకు పెరిగిందని అనుకుందాం. దీనిపై 12 శాతం పీఎఫ్ లెక్కిస్తే రూ.1800 అవుతుంది. అంటే ఇప్పడు చెల్లిస్తున్న దానికంటే నెలకు రూ.600 అధికంగా అటు ఉద్యోగి, ఇటు కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది.
భవిష్యత్తులో ఇది ఉద్యోగికి ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది కానీ ఇప్పుడు నెలనెలా భారం మాత్రం మోయకతప్పదు.
పెద్ద శాలరీ ఉన్న వాళ్ల లెక్కేంటి
నెలకు రూ.15 వేలకు మించి శాలరీ ఉన్న వాళ్లకు దీని వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఎందుకంటే పీఎఫ్ స్కీం పారా 26ఏ ప్రకారం బేసిక్ పై అధిక శాలరీ ఉన్న వాళ్లు పీఎఫ్ చెల్లించడమనేది వాళ్ల వ్యక్తిగతమైన నిర్ణయం. అయితే కొన్ని తీర్పుల నేపధ్యంలో ఉద్యోగులందరికీ కొద్దిగా బేసిక్ మొత్తాన్ని పీఎఫ్ రూపంలో సంస్థలు ఇప్పుడు చెల్లిస్తున్నాయి. అందుకని అధిక శాలరీలు ఉన్నవాళ్లకు ఈ తీర్పు వల్ల పెద్దగా ఇంపాక్ట్ ఉండబోదని ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ చెబ్తున్నారు.