వస్తువులు దొరకని పరిస్థితి రావొచ్చు, ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.4,000 వెయ్యాలి
సాధ్యమైనంత మేరకు కేంద్ర ప్రభుత్వం మరో విడత ఉద్దీపనలు ప్రకటించాలని కోరుతున్నారు ఆర్థికవేత్తలు. కరోనా కారణంగా వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని, లాక్ డౌన్ పూర్తై, అన్-లాక్లోకి ప్రవేశించినప్పటికీ డిమాండ్-లేమి కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.21 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినప్పటికీ... మరింత ఉద్దీపనలు అవసరమని చెబుతున్నారు. ఎస్పీ జైన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ వర్చువల్ కాన్ఫరెన్స్లో ఆర్థికవేత్తలు మాట్లాడారు.
అప్పుడే చెక్: చైనాకు పోటీగా ఉత్పత్తి... ఇవి పరిష్కరిస్తేనే సాధ్యం
ఎంఎస్ఎంఈలను కాపాడాలి.. లేదంటే ఆర్థికవేత్తల హెచ్చరిక
డిమాండ్ లేకపోవడంతో ఎంఎస్ఎంఈలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వీటిని ఆదుకోవడానికి మరింత సహకారం అవసరమని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఎంఎస్ఎంఈలు మూతబడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే దేశ పారిశ్రామిక సామర్థ్యం తగ్గి ఎక్కువ దిగుమతులకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రాబోవు సంవత్సరాల్లో ద్రవ్యోల్భణం పెరుగుతుందన్నారు. కరోనా-లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైందన్నారు. ఎంఎస్ఎంఈలను ఆదుకోకుంటే వస్తువులే దొరకని పరిస్థితి రావొచ్చునని ఆర్థికవేత్తలు అన్నారు.
అవసరమైనచోట ప్రభుత్వం ఖర్చు పెట్టాలి
అది మనం మన జీవితంలో చూసిన అతిపెద్ద ఆర్థిక సంక్షోభమని అనంత్ నారాయణ్ అన్నారు. ఖర్చు అవసరమైన చోట ప్రభుత్వం ఖర్చు పెట్టాలని, వ్యాపారాలకు తగిన ఉపశమనం కనిపించడం లేదని, వారి బాటమ్ లైన్ దెబ్బతిన్నదన్నారు. జీఎస్టీ వసూళ్లు 15 శాతం నుండి 20 శాతం మధ్య మాత్రమే తగ్గాయని, కాబట్టి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే వాటిని తిరిగి పొందవచ్చునని చెప్పారు.
ఉపశమనం.. డిమాండ్ ఉద్దీపన కాదు
ప్రభుత్వం ప్రకటించిన రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ ఉపశమనం మాత్రమేనని, కానీ డిమాండ్ పెంచే ఉద్దీపన కాదని మాజీ చీఫ్ స్టాటిస్టియన్ ఆఫ్ ఇండియా ప్రనబ్ సేన్ అన్నారు. నగదు బదలీ మంచి ఆలోచన అని, కానీ ప్రజల ఖాతాల్లో వేసిన మొత్తం మాత్రం జోక్ అన్నారు. రూ.500 నుండి రూ.1,000 ఏమాత్రం సరిపోదని చెప్పారు. ఇది కనీసం రూ.3,000 నుండి రూ.4,000 మధ్య ఉండాలని తెలిపారు. ఉద్దీపనల కోసం డిమాండ్ చేయడానికి ఇదే సమయమన్నారు.
వస్తువులు దొరకని పరిస్థితి వస్తుంది
చిన్న, మధ్యతరహా సంస్థలను ఆదుకోకుంటే వస్తువులే దొరకని పరిస్థితి రావొచ్చునని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సాధ్యమైనంతమేర రెండో విడత ఉద్దీపన ప్రకటించకుంటే ఈ ఏడాది ఆఖరి నాటికి లేదా 2021 నాటికి ద్రవ్యోల్భణం గణనీయంగా పెరిగి వస్తువులు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ప్రణబ్ సేన్ ఆందోళన వ్యక్తం చేశారు. తొలి ఉద్దీపనలో వడ్డీరేట్ల పరంగా సాయం అందలేదని, దీర్ఘకాలంలో ప్రయోజనం కలిగించే సంస్కరణలు ప్రకటించారని ఎన్ఐపీఎఫ్పీ డైరెక్టర్ రిథిన్ రాయ్ అన్నారు.