మోడీ FRBM ఆఫర్.. ఏమిటిది?: తెలంగాణ, ఏపీకి ఎంత ప్రయోజనమంటే?
రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు రుణాలు పొందడానికి FRBM పరిమితిని పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు గరిష్టంగా 3% ఉండగా దీనిని 5 శాతానికి పెంచినట్లు ఆదివారం ప్రకటించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పరిధిలో మరో రూ.22,102 కోట్ల రుణం తీసుకునేందుకు వెసులుబాటు లభించింది. FRBM పరిమితిని పెంచాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలు రాష్ట్రాలు గత కొంతకాలంగా కోరుతున్నాయి.
రాష్ట్రాలకు రుణపరిమితి భారీగా పెంపు, ఉపయోగించుకుంది 14 శాతమే: నిర్మల
ఏమిటీ FRBM?
పారదర్శకత, పటిష్టమైన ఆర్థిక నిర్వహణ కోసం 2003లో FRBM చట్టాన్ని రాష్ట్రాల ఆమోదంతో కేంద్రం తీసుకు వచ్చింది.దీని ప్రకారం రాష్ట్రాలు ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో 3 శాతానికి మించి రుణాలు తీసుకోవద్దు. ఆయా రాష్ట్రాల సమర్థ ఆర్థిక విధానాలు సహా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని FRBM పరిమితిని మూడు శాతం నుండి 0.5 శాతం వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. గత ఆర్థిక సంవత్సరం తెలంగాణ FRBM 3.5 శాతంగా ఉంది.
FRBM పరిధిలోని రుణాలు రాష్ట్రాల బడ్జెట్ పరిధిలో ఉంటాయి. ఆర్బీఐ ద్వారా రాష్ట్ర బాండ్స్ వేలం వేసి తక్కువ వడ్డీ, ఎక్కువ కాలపరిమితితో రాష్ట్రాలు ఈ రుణాలు సమకూర్చుకుంటాయి. అయితే జాతీయ భద్రత, విపత్తుల సమయంలో FRBM పరిమితిలో మినహాయింపు అవకాశం ఉంది. ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్రం పరిమితిని పెంచింది.
రెండు రకాల రుణాలు.. FRBM బెస్ట్
రాష్ట్ర ప్రభుత్వం రెండు రకాలుగా రుణాలు తీసుకుంటుంది. బడ్జెట్ పరిధిలో FRBM పరిమితి మేరకు తీసుకునే రుణాలు ఉంటాయి. ఇవి బాండ్స్ను విక్రయించి తీసుకుంటాయి. తక్కువ వడ్డీ, దీర్ఘకాలపు చెల్లింపు ఉంటాయి. రాష్ట్రాలకు చెల్లింపులకు సౌకర్యంగా ఉంటుంది. రెండోది బడ్జెట్ వెలుపల తీసుకునే రుణాలు. వీటికి అత్యధిక వడ్డీ ఉంటుంది. తక్కువ సమయంలోనే చెల్లింపులు చేయాలి. వివిధ కార్పోరేషన్లను ఏర్పాటు చేసి ఓ లక్ష్యంతో ఈ రుణాలు తీసుకుంటాయి. చెల్లింపులకు గ్యారంటీ ఉంటుంది.
తెలంగాణ ఎంత తీసుకోవచ్చు?
ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.11,05,136 కోట్లు. FRBM పరిమితి మూడు శాతం. కాబట్టి రూ.33 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఐదు శాతానికి పెంచడంతో రూ.55వేల కోట్లకు పైగా తీసుకునే వెసులుబాటు ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఎంత తీసుకోవచ్చు?
FRBM పరిమితి పెంచిన నేపథ్యంలో మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపు రూ.20,160 కోట్ల వరకు అదనపు రుణం పొందే అవకాశం ఉంది. ఏపీ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి రూ.10.08 లక్షల కోట్లు. దీని ప్రకారం రూ.30 వేల కోట్లకు పైగా రుణం పొందవచ్చు. కేంద్రం తాజా నిర్ణయంతో రూ.50వేల కోట్లకు పైగా తీసుకునే వెసులుబాటు ఉంది.