Budget 2020: హోమ్లోన్ సహా ఈ పన్నులపై మినహాయింపు ఇస్తే..
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో వివిధ రంగాలు ట్యాక్సులు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాయి. మందగమనం నేపథ్యంలో వృద్ధి రేటు పట్టాలెక్కించేందుకు ఏం చర్యలు తీసుకోవాలని మోడీ ప్రభుత్వం ఆర్థిక నిపుణుల నుంచి సూచనలు తీసుకుంటోంది. వీటిని పక్కన పెడితే చాలామంది వేతనజీవులు ఆదాయపు పన్ను పరిమితి, మినహాయింపుల గురించి ఆలోచిస్తుంటారు.
బడ్జెట్ బొనాంజా: రూ.7 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు? రూ.60వేలు ఆదా
సెక్షన్ 80సి పరిమితి పెంచాలని డిమాండ్
ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం సెక్షన్ 80C కింద రూ.1,50,000 వరకు మినహాయింపు ఉంది. దీనిని పెంచాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. పెట్టుబడుల ప్రోత్సాహానికి ఇవి అవసరమని అంటున్నారు. ఈ పరిమితిని రూ.2,50,000 వరకు పెంచితే బాగుంటుందని అంటున్నారు.
ఇన్సురెన్స్ను ప్రత్యేకంగా పరిగణించినా...
అలాగే, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలకు చెల్లించే ప్రీమియాన్ని ప్రత్యేకంగా పరిగణించినా సరిపోతుందని అంటున్నారు. వీటిలో ఏమైనా వెసులుబాటు ఉంటుందా చూడాలి.
హోమ్ లోన్ వడ్డీపై మినహాయింపు పెంపు
హోమ్ లోన్ కోసం చెల్లించే వడ్డీకి సెక్షన్ 24 ప్రకారం రూ.2 లక్షల వరకు మినహాయింపు ఉంది. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దీనిని రూ.3 నుంచి రూ.4 లక్షలకు పెంచాలని కోరుకునే వారు ఉన్నారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతమిచ్చినట్లవుతుంది.
ఆరోగ్య ప్రీమియం
హాస్పిటల్స్ ఖర్చుల కోసం ఆరోగ్య బీమా ప్రీమియం తప్పనిసరి. ఈ ప్రీమియంలు ఇటీవల పెరిగాయి. సెక్షన్ 80D ప్రకారం ప్రస్తుతం ఇస్తున్న మినహాయింపును రూ.25,000 నుంచి రూ.35,000 పెంచాలని కోరుతున్నారు.
ఈక్విటీ పన్ను
ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత మ్యుచువల్ ఫండ్స్ ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్షకు మించి ఆర్జించినప్పుడు ఆ పై మొత్తానికి 10 శాతం పన్ను చెల్లించాలి. ఇది చాలామంది ఇన్వెస్టర్లకు ఇబ్బందిగా మారింది. ఈ పరిమితిని రూ.2 లక్షలకు పెంచాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈక్విటీల్లోకి పెట్టుబడులు కూడా ప్రోత్సహించినట్లు అవుతుందని చెబుతున్నారు.
అలా పెట్టుబడులు పెరిగి...
బ్యాంకులో 5 ఇయర్ పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ల వలె డెట్ లింక్డ్ సేవింగ్ స్కీం ప్రతిపాదించాలని మ్యుచువల్ ఫండ్ల సంఘం ప్రతిపాదిస్తోంది. దీంతో డెట్ స్కీముల్లోకి పెట్టుబడులు పెరుగుతాయని చెబుతోంది. పన్ను ఆదా కోసం చిన్న ఇన్వెస్టర్లకు ఎక్కువ ఆదాయానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దీర్ఘకాలిక మౌలిక వసతుల బాండ్స్ను మళ్లీ ప్రవేశ పెడితే.. ప్రభుత్వం ఖర్చు పెట్టేందుకు దీంతో మౌలిక రంగం వృద్ధికి తోడ్పడుతుందని చెబుతున్నారు.