టీవీ ఉచితం, ఈ ట్యాక్స్ అదనం: జియో గిగాఫైబర్ గురించి పూర్తిగా తెలుసుకోండి
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సాంకేతిక విప్లవం సృష్టిస్తున్నారు. ఇప్పటికే జియో రాక ద్వారా టెలికం రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. గిగా ఫైబర్ ద్వారా సినిమా, టీవీ, ఇంటర్నెట్ రంగంలో భారీ విప్లవం తీసుకు వస్తున్నారు. ఒకే కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్ సౌకర్యాలను అందించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం జియో గిగా ఫైబర్ సెప్టెంబర్ 5వ తేదీన రాబోతుంది. ఉచితంగా టీవీ కనెక్షన్, దేశంలో ఎక్కడైనా ఖర్చు లేకుండా వాయిస్ కాల్ కోసం ల్యాండ్ లైన్ ఫోన్, దేశవిదేశాల్లోని నలుగురితో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుకునే సదుపాయాలు కల్పించనున్నారు.
జియో బంపరాఫర్: థియేటర్లో సినిమా విడుదలైన రోజే ఇంట్లో చూడొచ్చు
అమెరికా నెట్ సగటు వేగం కంటే గిగాఫైబర్ స్పీడ్ ఎక్కువ
రిలయన్స్ జియో గిగా ఫైబర్ ఇంటర్నెట్ వేగం కనిష్టం 100 ఎంబీపీఎస్. గరిష్టం 1 జీబీపీఎస్. అమెరికాలోని నెట్ సగటు వేగం కంటే దీని వేగం ఎక్కువ కావడం గమనార్హం. సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభం కానున్న గిగా ఫైబర్తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంటర్నెట్, సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చుకునే వెసులుబాటు, లైవ్ టీవీ ఛానల్స్, ఉచిత వీడియో కాన్ఫరెన్స్, గేమింగ్స్, వర్చువల్ రియాలిటీ వంటి సౌకర్యాలు లభిస్తాయి.
ఎల్ఈడీ టీవీ ఉచితం
గిగా ఫైబర్ తీసుకుంటే వైఫై మోడెం పరికరం అందిస్తారు. జియో 4K సెట్ టాప్ బాక్స్ ఉచితంగా ఇస్తారు. వార్షిక చందాదారులకు ఎల్ఈడీ టీవీని ఉచితంగా ఇస్తారు. జియో ఫైబర్, జియో సెట్ టాప్ బాక్స్ల సేవల్లో మంచి నాణ్యత కావాలంటే ఎల్ఈడీ ఉండాలి. అందుకే ఏడాది స్కీంను ఎంచుకునే వారికి జియో ఫరెవర్ ప్లాన్ కింద HD లేదా 4K LED టీవీ, 4K సెట్ టాప్ బాక్స్ ఉచితంగా ఇస్తారు.
వైఫై రోటర్-సెట్ టాప్ బాక్స్ కలిసి ఉంటాయి. దీంతో సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చుకోవచ్చు. ప్రీమియం కస్టమర్లకు థియేటర్లో సినిమా విడుదలైన రోజునే తమ ఇంట్లోను కొత్త సినిమా చూసే 'జియో ఫస్ట్ డే ఫస్ట్ షో' సదుపాయాన్ని 2020 మధ్యలో తీసుకురానున్నారు.
ఉచిత, తక్కువ ధరకే కాల్స్
కస్టమర్లకు ఉచిత లాండ్లైన్ ఫోన్ ఇస్తారు. దేశంలో ఏ మొబైల్ లేదా ల్యాండ్ లైన్ కు అయినా ఉచితంగా జీవితకాలం పాటు ఉచిత వాయిస్ కాల్స్ ఇస్తారు. చాలా తక్కువ ధరకు విదేశాలకు అపరిమిత కాలింగ్ ప్యాక్ను జియో ద్వారా అందిస్తారు. రూ.500 నెల సబ్స్క్రిప్షన్తో అమెరికా, కెనడాలకు పోన్ చేసుకోవచ్చు.
నెలసరి సేవలకు ఇలా...
100 MBPS వేగంతో బ్రాడ్బాండ్ సేవలు పొందాలనుకునే వారికి నెలకు రూ.700 నుండి 1GBPS వేగం సేవలు పొందాలనుకునే వారికి నెలకు రూ.10,000 వరకు స్కీం ఉంది. అలాగే, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోటీలైవ్, ఏరోస్ నౌ, హోయ్ చోయ్, ఆల్ట్ బాలాజీ వంటి OTT కంటెంట్ ప్రొవైడర్లకు సంబంధించిన ప్రీమియమ్ సబ్స్క్రిప్షన్లు కూడా జియో ఫైబర్లో అందుబాటులో ఉంటాయి.
నెల చెల్లింపులకు పన్నులు అదనం, పే ఛానల్స్కు అదనం
నెలవారీ చెల్లింపులు రూ.700 నుంచి రూ.10,000 వరకు ఉంది. జీఎస్టీ వంటి పన్నులు అదనంగా ఉంటాయి. పే ఛానల్స్కు ఫైబర్ లేదా డీటీహెచ్ ద్వారా పొందేందుకు చందాదారులు అదనంగా చెల్లించాల్సి ఉంటుందట.
ఇంటర్నేషనల్ రేట్లతో పోలిస్తే పదోవంతు
ముఖేష్ అంబానీ ప్రకటన ప్రకారం... ప్రపంచంలో అమెరికా వంటి దేశాల్లో ఫిక్స్డ్ లైన్ డౌన్లోడ్ స్పీడ్ 90MBPS. జియో ఫైబర్ స్కీంలో స్టార్టింగ్ స్పీడే 100MBPS. అలాగే ఇంటర్నేషనల్ ధరలతో పోలిస్తే పదో వంతు మాత్రమే వసూలు చేస్తున్నారు.
మిక్స్డ్ రియాల్టీ
జియో సెట్ టాప్ బాక్స్ ద్వారా MR (మిక్స్డ్ రియాల్టీ) సేవలు అందిస్తారు. ఎంఆర్ షాపింగ్, ఎంఆర్ ఎడ్యుకేషన్, ఎంఆర్ మూవీ వంటి సేవలు పొందవచ్చు. ఇందుకోసం జియో హోలోబోర్డ్ ఎంఆర్ హెడ్ సెట్ను ఆఫర్ చేస్తుంది. దీనిని ఓ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ హెడ్ సెట్ విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నాయి.
ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలే
రిలయన్స్ జియో గిగా ఫైబర్ను ప్రకటించిన నేపథ్యంలో టెలికాం, బ్రాడ్ బాండ్ విభాగంలోని ప్రత్యర్థి కంపెనీలు వ్యూహాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇప్పటికే జియో రాకతో ఎయిర్ టెల్, ఐడియా వొడాఫోన్ వ్యూహాలు మార్చుకున్నాయి. అయినప్పటికీ జియోతో పోటీ పడలేక కస్టమర్లు తగ్గుతున్నారు. ఇప్పుడు కేవలం రూ.700 నుంచి రూ.10,000కే 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ అంటే.. ప్రత్యర్థి కంపెనీలు ఏం చేస్తాయనేది ఆసక్తిగా మారింది.
|
కాశ్మీర్లో పెట్టుబడులు..
జమ్ము కాశ్మీర్, లఢక్ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ముఖేష్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ను రానున్న 18 నెలల్లో రుణరహిత కంపెనీగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. చమురు, రసాయనాల్లో 20 శాతం వాటా విక్రయిస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో 49 శాతం వాటాను BPకి రూ.7000 కోట్లకు విక్రయిస్తున్నారు. సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్కోకు రిలయన్స్ చమురు, రసాయనాల వ్యాపారంలో 20% వాటాను రూ.1.05 లక్షల కోట్లకు విక్రయించనున్నారు. ఈ లావాదేవీలు ఈ ఏడాదిలో పూర్తి కావొచ్చు.
స్టార్టప్లకు ఆర్థిక మద్దతు
స్టార్టప్లకు ఊతమిచ్చేందుకు మైక్రోసాఫ్టుతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. దేశవ్యాప్తంగా డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. స్టార్టప్లకు ఉచిత క్లౌడ్ సేవలు అందిస్తుంది. డేటా కేంద్రాల్లో మైక్రోసాఫ్ట్ తన అజుర్ క్లౌడ్ ప్లాట్ ఫాంను తీసుకు రానుంది. గుజరాత్, మహారాష్ట్రలలో తొలి రెండు డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం. స్టార్టప్స్ తమ వ్యయాల్లో అధిక శాతం క్లౌడ్, సంబంధిత మౌలిక వసతులపై వెచ్చించవలసి వస్తోంది. స్టార్టప్స్కు ఉచితంగా క్లౌడ్ సేవలు అందించేందుకు జియో సిద్ధమవుతోంది. తమకు కావాల్సిన ప్యాకేజీని జనవరి 1, 2020 నుంచి జియో.కామ్ నుంచి ఎంచుకోవచ్చు. భారత్కు అవసరమైన వ్యవసాయం, హెల్త్, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి వాటికి పరిష్కారం చూపే స్టార్టప్స్ల్లో జియో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆర్థికంగా మద్దతు ఇస్తుంది.
MSMEలకు...
ఎంఎస్ఎంఈలు ఆర్థిక వ్యవస్థలో కీలకం. ఈ కంపెనీలకు అనుసంధాన, ఉత్పాదక, ఆటోమేషన్ టూల్స్ వ్యయాలు భారీగా అవుతాయి. వీరికి ఈ అనుసంధాన సేవలను నెలకు రూ.1500 ప్రారంభ ధరతో అందిస్తారు.
అన్లిమిటెడ్ ఎంటర్ ప్రైజ్, గ్రేడ్ వాయిస్, డేటా సర్వీసెస్ వీడియో కాన్ఫరెన్స్, సెక్యూరిటీ సొల్యూషన్స్, మార్కెటింగ్, సేల్స్ తదితర ఉత్పాదక టూల్స్ పొందవచ్చు.
రిలయన్స్ ఆస్తులు.. అప్పులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ వ్యాల్యూ రూ.9.5 లక్షల కోట్లు. ఈ కంపెనీ నగదు నిల్వలు జూన్ 30వ తేదీ నాటికి రూ.1,31,710 కోట్లు. గత అయిదేళ్లలో ఈ కంపెనీ వివిధ రంగాల్లో పెట్టుబడుల కోసం రూ.5.4 లక్షల కోట్లు సేకరించింది. 2019 జూన్ నాటికి రిలయన్స్ గ్రూప్ రుణం రూ.2,88,243 కోట్లు. హెచ్పీ, ఆరామ్కో ద్వారా రూ.1.15 లక్షల కోట్లు సేకరించవచ్చు.