ట్యాక్స్ గుడ్న్యూస్: ఐటీ రిటర్న్స్లో ఆ వివరాలు అక్కరలేదు
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించే ప్రకటన చేసింది. రోజువారీ ట్రేడింగ్, స్వల్పకాల విక్రయాలు లేదా కొనుగోళ్లు చేసే వారు షేర్లు వారీ నివేదికలను తమ ఆదాయ పన్ను రిటర్న్స్లో పొందుపరచాల్సిన అవసరం లేదని ఆదాయపు పన్ను విభాగం తెలిపింది. 2020-21 మదింపు సంవత్సరానికి ఇది వర్తిస్తుందని శనివారం (సెప్టెంబర్ 26) ఓ నోటిఫికేషన్లో తెలిపింది. ఈ మదింపు సంవత్సరానికి షేరు వారీ వివరాలను సమర్పించాల్సి ఉంటుందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీబీడీటీ స్పష్టతను ఇచ్చింది.
కరోనా సమయంలోను... 6 నెలల్లో ఆకాశానికెగిసి, 6 రోజుల్లో పాతాళానికి పడ్డాయి!
ట్రేడింగ్
2018 ఫైనాన్స్ యాక్ట్లో చేసిన సవరణ ఆధారంగా వచ్చిన లాభాలకు అదనపు పన్ను ఉంటుందని, కానీ 2020-21 అసెస్మెంట్కు సంబంధించి ట్రేడింగ్ ఆదాయాన్ని వెల్లడించాల్సిన అవసరం లేదని ఆ నోటిఫికేషన్లో తెలిపింది. స్టాక్ వ్యాపారులు తమ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో వారి ఆదాయానికి సంబంధించి స్క్రిప్ వారీగా రిపోర్ట్ అవసరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 26వ తేదీన పేర్కొంది.
స్టాక్ ట్రేడర్లు.. డే ట్రేడర్లు..
సాధారణంగా స్టాక్ ట్రేడర్లు లేదా డే ట్రేడర్లు తమ ట్రేడింగ్ ద్వారా ఆర్జించిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభం లేదా వ్యాపార ఆదాయంగా చూపిస్తారు. చాలా కేసుల్లో ఏడాది లోపు ఉంచుకున్న షేర్లు, యూనిట్ల విషయంలో ముందస్తుగానే ఈ వివరాలు వెల్లడిస్తారు. ఒకవేళ వెల్లడించని పక్షంలో వాటిని దీర్ఘకాలిక మూలధన లాభాల కేటగిరీలోకి చేరుస్తారు.
పన్ను మినహాయింపులు
ఫైనాన్స్ చట్టం 2018కి లోబడి 2018 జనవరి 31 వరకు ఉన్న లిస్టెడ్ షేర్లు, ప్రత్యేక యూనిట్లపై ఆర్జించిన లాభాలపై కూడా పన్ను మినహాయింపులకు అనుమతి ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రూ.1 లక్షకు పైన ఉన్న ఈక్విటీలలో లాంగ్ టర్మ్ కాపిటల్ గెయిన్స్ 10 శాతం చొప్పున పన్ను ఉంటుంది.