మనీ ట్రాన్సుఫర్ చేసేవారికి గుడ్న్యూస్, డిసెంబర్ 1 నుండి అమల్లోకి...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) ద్వారా 24x7 ఫండ్ ట్రాన్సుఫర్కు అనుమతించింది. రేపటి నుండి (డిసెంబర్ 1, 2020) రౌండ్ ది క్లాక్ ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను ప్రోత్సహించేందుకు, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిత్యం పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేసే వ్యాపారులకు ఇది ఎంతో ప్రయోజనకరం. ప్రస్తుతం ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారం మినహాయించి మిగతా ఆఫీస్ రోజుల్లో ఉదయం గం.7 నుండి సాయంత్రం గం.6 వరకు ఉంటుంది.
మరింత సులభతరం..
ఆర్బీఐ వినియోగదారులకు అన్ని సేవల్ని ఎప్పటికప్పుడు సులభతరం చేస్తోంది. డిసెంబర్ 2020 నుండి RTGS నిత్యం పని చేయనుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం అన్ని వర్కింగ్ డేస్లలో ఉదయం గం.7 నుండి సాయంత్రం గం.6 వరకు అనుమతి ఉంది. రేపటి నుండి నిత్యం అందుబాటులో ఉంటుంది. నెఫ్ట్ (NEFT) సౌకర్యం డిసెంబర్ 16, 2019 నుండి 24x7 అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
కొన్ని దేశాల్లో భారత్ ఒకటి..
RTGS కొత్త రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీజీఎస్ 24x7x365 సౌకర్యం కలిగిన ప్రపంచంలోని కొన్ని దేశాల్లో భారత్ ఒకటిగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా ఎక్కువ మొత్తాన్ని ట్రాన్సుఫర్ చేయవచ్చు. కనీస మొత్తం రూ.2,00,000. అప్పర్ లిమిట్ లేదా మాగ్జిమం సీలింగ్ లేదు.
కనీస మొత్తం రూ.2,00,000
డిసెంబర్ 1వ తేదీ నుండి పెద్ద మొత్తాన్ని బదలీ చేయడానికి మీరు బ్యాంకు పని వేళల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. మనీని ట్రాన్సుఫర్ చేసేందుకు ఆర్టీజీఎస్ను ఉపయోగిస్తారు. ఆర్టీజీఎస్ ద్వారా కనీసం రూ.2 లక్షల మొత్తాన్ని పంపించవచ్చు. ఆర్బీఐ FAQ ప్రకారం గరిష్ట పరిమితి లేదు. అయితే బ్యాంకులు సాధారణంగా రూ.10 లక్షల గరిష్టాన్ని అనుమతిస్తున్నాయి.