కొత్త ఆదాయపు పన్ను విధానం: మీ సేవింగ్స్పై ప్రభావం... కానీ
ఇటీవలి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అదనంగా కొత్త ట్యాక్స్ పన్ను విధానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. దాదాపు ఎలాంటి మినహాయింపులులేని కొత్త పన్ను విధానంతో దేశంలో సేవింగ్స్ పైన ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సేవింగ్స్ తగ్గుతోందని, కొత్త పన్ను విధానంతో సేవింగ్స్పై మరింత ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఇదివరకు ఉన్న పన్ను విధానంతో పాటు మినహాయింపులు లేని తక్కువ పన్ను విధానాన్ని కేంద్రం తీసుకు వచ్చింది. అయితే ఇది ఐచ్ఛికం.
దయచేసి మీ డబ్బంతా తీసుకోండి..డిస్కౌంట్ వద్దు, లోన్ తీసుకుంది నేను కాదు!: మాల్యా తిరకాసు
ప్రజల సేవింగ్స్పై ప్రభావం
ఆర్థిక మందగమనం నేపథ్యంలో డిమాండ్ తగ్గిందని, దీనిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్, పర్సనల్ ట్యాక్స్ను తగ్గించిందని NIPFP ప్రొఫెసర్ ఎన్ఆర్ భానుమూర్తి అన్నారు. ఈ చర్యల వల్ల డిమాండ్ స్వల్పంగా పెరుగుతుందని, అయితే మినహాయింపులు లేని పన్ను విధానంతో ప్రజల సేవింగ్స్పై ప్రభావం పడుతుందన్నారు.
పడిపోతున్న సేవింగ్స్ రేటు
నివేదికల ప్రకారం గత ఆరేళ్ళుగా భారత్లో సేవింగ్స్ రేట్ పడిపోతోంది. 2012లో 36 శాతంగా ఉన్న సేవింగ్స్ ఇటీవల 30 శాతానికి పడిపోయింది. మరో 80 శాతం మంది పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానంలోకి మారవచ్చునని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే గతంలో చెప్పారు. అప్పుడు సేవింగ్స్ మరింత తగ్గుతాయని భావిస్తున్నారు.
సేవింగ్స్ తగ్గిపోతాయి.. కానీ
కొత్త పన్ను విధానం వల్ల సేవింగ్స్ ఇన్సెంటివ్స్ కచ్చితంగా తగ్గిపోతాయని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర మాజీ మంత్రి యోగిందర్ అలాఘ్ అన్నారు. ఆర్థిక మందగమన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పన్ను విధానం తప్పు కాదని, JNU అసిస్టెంట్ ప్రొఫెసర్ రోహిత్ ఆజాద్ అన్నారు. సేవింగ్స్ రేటు తగ్గినప్పటికీ మందగమన పరిస్థితుల్లో సరైన చర్య అన్నారు.
వారికి ఎలాంటి ప్రయోజనం లేదు..
కొత్త పన్ను విధానం వల్ల పన్ను భారం తగ్గడం వాస్తవమేనని, కానీ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని రోహిత్ ఆజాద్ అన్నారు. కాగా, ఏప్రిల్ 1, 2020 నుండి కొత్త పన్ను విధానం కూడా అమలులో ఉంటుంది. పాత విధానం, కొత్త విధానంలో ఏదైనా ఎంచుకునే ఆప్షన్ కేంద్రం ఇచ్చింది.