పన్ను చెల్లించటం లేదా అయితే మీకు కష్టకాలమే!
ప్రభుత్వం నడవాలంటే పన్నులు వసూలు కావాలి. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆశించిన మేర పన్ను వసూళ్లు జరగటం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక వైపు ఆర్థిక మందగమనం, మరో వైపు నోట్ల రద్దు, జీఎస్టీ అమలు లోపల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. కానీ ప్రభుత్వమేమీ భారీ పన్ను వసూళ్ల టార్గెట్ పెట్టుకుంది. ఇదిలా ఉండగా... ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తీసుకున్న నిర్ణయం తో పన్ను చెల్లింపులు మరింత తగ్గిపోయాయి. కార్పొరేట్ పన్ను రేటును ప్రస్తుతమున్న 30% నుంచి 22% నికి కుదించారు.
అది కూడా ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. దీంతో సుమారు 8% రాబడి రెగ్గిపోయింది. దీంతో ఖజానాకు రావాల్సిన రూ 1.45 లక్షల కోట్ల పన్ను కంపెనీల పుస్తకాల్లోకి చేరిపోతోంది. జీఎస్టీ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవటంతో కేంద్ర ప్రభుత్వం రాష్రాలకు ఇవ్వాల్సిన నిధులను ఆలస్యం చేస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా అభివృద్ధి కుంటుపడుతోంది. అయితే, కారణాలు ఎలా ఉన్నప్పటికీ... పన్ను వసూళ్లు మాత్రం తగ్గకూడదని ప్రధాని మోడీ ఇన్కమ్ టాక్స్ అధికారులను ఆదేశించారు. దీంతో వారు తమ ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధమవుతున్నారు.
అమెరికా ఎఫెక్ట్: రెండ్రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర
జరిమానాలు... కేసులు...
ఇటీవల ఇన్కమ్ టాక్స్ అధికారులతో జరిగిన ఒక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఏం చేస్తారో తెలియదు. టార్గెట్ మాత్రం మిస్ అవ్వొద్దు అని గట్టిగ చెప్పారట. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా అదే సూచించారట. ఇంకేముంది అవకాశం లభించాలి కానీ తమ ప్రతాపం చూపించే పన్ను వసూళ్ల అధికారులు ఇకపై పన్ను చెల్లింపుదార్ల ని పీడించేందుకు రెడీ అవుతున్నారట. ప్రతి పన్ను చెల్లింపుదారు ఖాతాను ఒకటికి రెండు సార్లు పరిశీలించి, ఏమాత్రం తేడా వచ్చినా వారిపై భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. పన్ను చెల్లింపులు ఆలస్యం అయితే ఏకంగా కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడబోరని తెలుస్తోంది.
వ్యాపారులకు చుక్కలు...
జీఎస్టీ అమల్లోకి వచ్చాక ... దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులకు కొత్త చిక్కొచ్చి పడింది. రాష్ట్రాన్ని బట్టి రూ 20 లక్షల నుంచి రూ 40 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యాపారాలు జీఎస్టీ రిజిస్టర్ చేసుకోవాల్సిన పనిలేదు. కానీ జీఎస్టీ లేని వ్యాపారుల నుంచి ప్రోడక్టులు, సేవలు కొనుగోలు చేసేందుకు పెద్ద కంపెనీలు ఆసక్తి చూపటం లేదు. ఎందుకంటే వారి తరపున పెద్ద కంపెనీలే పన్ను చెల్లించాల్సి రావటమే అసలు కారణం. అలాగని జీఎస్టీ రిజిస్టర్ చేసుకుంటే... ఆదాయం ఉన్నా లేకున్నా ప్రతి నెలా రిటర్న్స్ దాఖలు చేయాలి. తక్కువలో తక్కువ ఇందుకోసం నెలకు రూ 1,000 వరకు ఖర్చు అవుతోంది. అందుకనే చిన్న వ్యాపారాలు జీఎస్టీ రిజిస్టర్ చేసుకున్నా ... రిటర్న్స్ మాత్రం దాఖలు చేయటం లేదు. అలాంటి వారికి రిటర్న్స్ దాఖలు చేయనందుకు రోజుకు రూ 50 నుంచి రూ 100 వరకు ప్రభుత్వం జరిమానా విధిస్తోంది. ఈ భారం మోయలేని వ్యాపారాలు అసలు జీఎస్టీ అంటేనే ఒక బూచిగా చూస్తున్నారు.
రూ 13 లక్షల కోట్ల లక్యం..
కేంద్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ 13 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూలు లక్ష్యం విధించుకుంది. కానీ ఇప్పటికే 9 నెలలు గడుస్తున్నా... ఆశించిన స్థాయిలో పన్నులు వసూలు కావటం లేదు. గతేడాది కంటే కనీసం 20% అధిక వసూళ్ల టార్గెట్ ఉండగా... ఇప్పటివరకు 5% కూడా వృద్ధి నమోదు కాలేదు. ఇక జీఎస్టీ తో రావాల్సిన పరోక్ష పన్నుల వసూళ్లు సగటున నెలకు రూ 1 లక్ష కోట్లు రావటమే గగనం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇన్కమ్ టాక్స్, జీఎస్టీ అధికారులు కఠినంగా వ్యవహరించి పన్ను రాబడిని పెంచాలని ప్రభుత్వం వారిని ఆదేశించింది.
సకాలంలో చెల్లింపులు...
పైన వివరించిన కారణాల వల్ల ఈ ఏడాది ఇన్కమ్ టాక్స్ అధికారులతో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే మీరు వీలైనంత త్వరగా పన్ను చెల్లింపుల్లో సమస్యలు ఉంటె పరిష్కరించుకోండి. సకాలంలో పన్నులు చెల్లించి జరిమానాలు, కేసుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే అధికారుల నుంచి వేధింపులు తప్పవని హెచ్చరిస్తున్నారు.