శాలరీ స్ట్రక్చర్, గ్రాట్యుటీ రూల్స్: ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త రూల్స్
కరోనా నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో వినియోగ డిమాండ్ పెంచేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో పలు చర్యలు ప్రకటించారు. దీంతో ఏప్రిల్ 1వ తేదీ నుండి వివిధ రూపాల్లో ఆదాయ పన్ను మార్గంలో సగటు భారతీయుడి జేబుకు చిల్లు పడేలా ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త వేజ్ కోడ్తో ఉద్యోగుల వేతన స్ట్రక్చర్లో మార్పులు, ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్, ఐటీఆర్ ఫైలింగ్లో ఎల్టీసీ వోచర్ల దాఖలు తదితర రూపాల్లో పన్ను వసూళ్లు, మినహాయింపులు ఉంటాయి.
ఉద్యోగుల వేతనం పెరుగుతుంది
న్యూవేజ్ కోడ్ వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తే మొత్తం ఉద్యోగుల వేతనంలో దాదాపు యాభై శాతం పెరుగుతాయి. అత్యధిక కంపెనీలు తమ ఉద్యోగుల వేతనం సుమారు 35 శాతం నుండి 40 శాతం పెంచే అవకాశముంది. కొత్త రూల్ అమలులోకి వస్తే ఉద్యోగుల స్థూల వేతనం కూడా పెరుగుతుంది.
గ్రాట్యుటీ, పీఎఫ్ కాంట్రిబ్యూషన్
ప్రస్తుతం ఉద్యోగి కనీస వేతనంలో 12 శాతం పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కింద వెళ్తుంది. ఉద్యోగి కనీస వేతనం యాభై శాతం పెరిగితే పీఎఫ్ఓలోను ఉద్యోగి కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. మీ స్థూల వేతనంలో రూ.60వేలు అయితే, కనీస వేతనం రూ.30వేలకు చేరుకుంటుంది. అప్పుడు పీఎఫ్ ఖాతాలో ఎక్కువ జమ అవుతుంది.
ప్రస్తుతం గ్రాట్యుటీ కింద అయిదేళ్లు పని చేస్తే వస్తుంది. కొత్త నిబంధన ప్రకారం ఏడాది తర్వాత గ్రాట్యుటీ పొందేందుకు అర్హులు.
ఎల్టీసీ స్కీమ్...
కరోనా నేపథ్యంలో లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC) స్కీంలో మినహాయింపులు ఇస్తోంది కేంద్రం. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు 2020 అక్టోబర్ 12 నుండి 2021 మార్చి వరకు ఎల్టీసీ కింద మినహాయింపులు పొందవచ్చు. ఇది వచ్చే నెల ఒకటో తేదీ నుండి ఉండదు.
ఈపీఎఫ్ఓలో ఉద్యోగి కాంట్రిబ్యూషన్ మొత్తం ఏడాదిలో రూ.2.5 లక్షలు దాటితే దానిపై వచ్చే వడ్డీ పైన పన్ను చెల్లించాలి. అంటే ఉద్యోగి ఈపీఎఫ్ఓలో ఏడాదిలో తన వాటా మొత్తం రూ.2.5 లక్షలు దాటితే ఆ సొమ్ముకు వచ్చే వడ్డీపై పన్ను ఉంటుంది.