కొత్త ఆదాయపు పన్ను విధానంతో ఉద్యోగులకు ప్రయోజనంలేదు: కంపెనీలకూ సవాల్
2020-21 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్నును తీసుకు వచ్చింది. పాత, కొత్త.. రెండు పన్ను విధానాలుంటాయి. ఇందులో దేనిని ఎంచుకోవాలనేది ఆదాయపు పన్ను చెల్లించే వారి ఇష్టం. సేవింగ్స్ ఎక్కువగా లేనివారికి కొత్త పన్ను విధానం బాగుంటుందనేది అభిప్రాయం. సేవింగ్స్ చేసేవారికి మాత్రం పాత విధానం బెట్టర్. పాత-కొత్త పన్ను విధానంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ అధికారులు, నిపుణులు పలుమార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ రెండు విధానాలపై తాజాగా HR కన్సల్టింగ్ సంస్థ మెర్సెర్ సర్వే నిర్వహించింది.
కొత్త విధానంతో లాభం లేదని 81 శాతం సంస్థలు
కొత్త ఐటీ విధానంతో ఉద్యోగులకు లాభం లేదని మెజార్టీ సంస్థలు ఈ సర్వేలో అభిప్రాయపడ్డాయి. తమ ఉద్యోగులకు కొత్త విధానం లాభిస్తుందని తాము విశ్వసించడం లేదని 81% సంస్థలు వెల్లడించాయి. ప్రస్తుత పన్ను విధానంతో పాటు కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి అమల్లో ఉంటుందని, నచ్చినదాన్ని ఎంచుకోవచ్చని నిర్మల వెల్లడించారు.
ఈ రంగాల్లో సర్వే..
ఈ క్రమంలో HR కన్సల్టింగ్ సంస్థ మెర్సర్ ఈ సర్వే నిర్వహించింది. వివిధ రంగాల్లోని 119 సంస్థల నుంచి HR, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ అభిప్రాయాలను సేకరించింది. వీరిలో 81% మంది తమ ఉద్యోగులకు కొత్త ఐటీ విధానంతో ప్రయోజనాలు లేవని తెలిపారు. ఐటీ/ఐటీ అనుబంధ, హెల్త్ కేర్, కెమికల్/లైఫ్ సైన్సెస్, కన్సల్టింగ్, టెలికం, ఎఫ్ఎంసీజీ/రిటైల్, ట్రావెల్/లాజిస్టిక్స్, విద్యా రంగాల్లో ఈ సర్వేను నిర్వహించారు.
60 శాతం మంది ఏమన్నారంటే
ఎక్కువ శాతం సంస్థలు కొత్త ఐటీ విధానంపై పెదవి విరుస్తున్నాయి. రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలు, రూ.10 లక్షల నుండి రూ.25 లక్షల ఆదాయం ఉన్నవారిపై కొత్త పన్ను విధానం ప్రభావం పడుతుందని 60 శాతం మంది అంచనా వేశారు.
పదవీ విరమణ, పొదుపుపై ప్రభావం
తమ ఉద్యోగుల పొదుపు ధోరణి, పదవీ విరమణ ప్రణాళికలపై ఈ కొత్త పన్ను విధానం ప్రభావం ఉంటుందని చూపుతుందని 80 శాతం మంది అభిప్రాయపడ్డారు.
కంపెనీల స్వచ్చంధ ప్రయోజనాలు..
కొత్త పన్ను విధానం వల్ల కంపెనీల నుండి స్వచ్ఛంద ప్రయోజనాలను పొందడానికి ఉద్యోగులు ముందుకు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని, దీంతో అధిక ఆదాయం పొందుతున్న వారు ఇతర పెట్టుబడుల ప్రత్యామ్నాయాల వైపు మళ్లవచ్చునని సర్వేలో తేలింది. ఇది కంపెనీలకు సవాల్తో కూడుకున్న అంశమని అంటున్నారు.
30 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఎంపిక చేసుకునే వెసులుబాటు
ప్రభుత్వం తెచ్చిన కొత్త పన్ను విధానాన్ని కేవలం 30 శాతం లోపు ఉద్యోగులు మాత్రమే ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉందని 83% మంది అభిప్రాయపడ్డారు. సెక్షన్ 17(2)లో మార్పు కారణంగా ఎన్పీఎస్, పీఎఫ్ వంటి వాటిలో పెట్టుబడులను పెట్టే విషయంలో పునరాలోచనలో పడే అవకాశాలు ఉంటాయని 80 శాతం మంది అభిప్రాయపడ్డారు.
కంపెనీలకు సవాల్
రెండు పన్నుల విధానాలను అమలు చేయడం HR విభాగానికి సవాల్గా మారనుందని 64% మంది అభిప్రాయపడ్డారు. కొత్త పన్ను విధానం వల్ల శాలరీ స్ట్రక్చర్లో మార్పు ఉంటుందని 13% మంది మాత్రమే అంచనా వేశారు. అంటే ఎక్కువ మంది ప్రస్తుత శాలరీ స్ట్రక్చర్నే వారు కొనసాగించే అవకాశముంది.