జొమాటో ఆదాయం ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో గత ఏడాదికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఇండియా లో ఫుడ్ డెలివరీ రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇందులో స్విగ్గి, జొమాటో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఈ పోటీ లో నిలిచేందుకు ఎంత భారీ ఆఫర్లు అయినా సరే గుప్పించేందుకు వెనుకాడలేదు. దాంతో బిజినెస్ బాగా పెరిగింది కానీ... నష్టాలు కూడా అదే స్థాయిలో వెంటాడాయి. సరిగ్గా ఇదే అంశాన్ని తాజాగా జొమాటో ప్రకటించిన ఆర్థిక ఫలితాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
మీ భర్త టెక్కీకదా.. శాలరీ పెంచడంలేదు
ఏ రకంగానైనా సరే కొత్త వినియోగదారులను ఆకర్షించాలి లేదా ఉన్న వారిని మళ్ళీ మళ్ళీ కొనుగోలు చేసేలా చూడాలి అనే వ్యాపార సూత్రాన్ని జొమాటో, స్విగ్గి ఫాలో అయ్యాయి. దాంతో ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. జొమాటో ఆర్థిక ఫలితాలు పరిశీలిస్తే ఆదాయం గణనీయంగా పెరిగింది. కానీ నష్టాల్లోనూ పెరుగుదలే నమోదు కావటం విశేషం. ఆదాయం భారీగా వృద్ధి చెందినప్పుడు లాభాలు ఆర్జించేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఎందుకో తెలియదు కానీ జొమాటో ఫలితాల్లో అది కనిపినిచకపోవటం గమనార్హం.
105% పెరిగిన రెవిన్యూ...
దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్న జొమాటో... 2019-20 ఆర్థిక సంవత్సర ఫలితాలను ప్రకటించింది. ఈ కాలానికి కంపెనీ 394 మిలియన్ డాలర్ల (సుమారు రూ 2,955 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది జొమాటో ఆదాయం 192 మిలియన్ డాలర్ల (రూ 1,440 కోట్లు) తో పోల్చితే 105% వృద్ధి నమోదు అయ్యింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... కంపెనీ పన్ను చెల్లింపుల కంటే ముందు నష్టాలు (ఎబిటా) 293 మిలియన్ డాలర్లు (రూ 2,197 కోట్లు) ఉండటం గమనార్హం. అంతక్రితం ఏడాది లో జొమాటో నష్టాలు 277 మిలియన్ డాలర్లు (రూ 2,077 కోట్లు) కావటం విశేషం. ఐతే ఈ నష్టాలు పూర్తిస్థాయి నికర నష్టాలను ప్రతిబింబిచవు. కానీ కంపెనీ మాత్రం తమ అప్పులు తక్కువగా ఉన్నాయని, దీంతో నికర నష్టాలు కూడా దాదాపు ఎబిటా నష్టాలకు దగ్గరగా ఉంటాయని తెలిపింది. ఇలా ఉండగా... మొత్తం వ్యయాలు ఎంతో వెల్లడించని జొమాటో... అవి మాత్రం అంతక్రితం ఏడాదితో పోల్చితే 47% పెరిగినట్లు వెల్లడించింది.
రెట్టింపు ఐన జీఎంవీ ...
2019-20 ఆర్థిక సంవత్సరంలో జొమాటో మొత్తం గ్రాస్ మర్చండైజ్ వేల్యూ (జీఎంవీ) కూడా రెట్టింపుకన్నా అధికమైంది. సమీక్ష కాలానికి జొమాటో 1.49 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ 11,250 కోట్లు) నమోదయింది. అంతక్రితం ఏడాది లో కంపెనీ జీఎంవీ 718 మిలియన్ డాలర్లుగా(రూ 5,385 కోట్లు) ఉంది. దీంతో 108% వృద్ధి నమోదు అయ్యింది. అయితే గతేడాది జొమాటో .. ఉబెర్ ఈట్స్ ను కొనుగోలు చేసి ఇందులో విలీనం చేసుకుంది. దీంతో కంపెనీ ఆదాయాలు, జీఎంవీ బాగా పెరిగిపోయినట్లు అర్థమవుతోంది. ఏది ఏమైనా జొమాటో ప్రారంభించిన తర్వాత తొలిసారి కంపెనీ జీఎంవీ ఒక బిలియన్ డాలర్ల మార్కు దాటటం విశేషం. జీఎంవీ తో పోల్చితే ఆదాయం మెరుగైన రీతిలో కనిపిస్తున్న ఏటా నష్టాలు, కష్టాలు మాత్రం తప్పటం లేదు.
లాక్డౌన్ లో దెబ్బ...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లొక్డౌన్ పీరియడ్ లో ఫుడ్ డెలివరీ కంపెనీల పై విపరీతమైన ప్రభావం కనిపించింది. అది జొమాటో ఆదాయం లో కూడా స్పష్టమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు తొలి త్రైమాషికానికి జొమాటో 41 మిలియన్ డాలర్ల (రూ 307 కోట్లు)ఆదాయాన్ని ఆర్జించింది. దీనిపై 12 మిలియన్ డాలర్ల (రూ 90 కోట్లు) నష్టాలను చవిచూసింది. వాస్తవానికైతే 2019-20 తో పోల్చితే ఒక త్రైమాసికానికి కనీసం 100 మిలియన్ డాలర్ల ఆదాయం రావాల్సి ఉంది. కానీ కేవలం 41 మిలియన్ డాలర్ల రెవిన్యూ మాత్రమే రావటంతో ఈ త్రైమాషికంలో రాబడి 60% పడిపోయినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా... జొమాటో మాత్రం తన నష్టాలు తగ్గుతూ వస్తున్నాయని, లాభాల దిశగా తమ ప్రయాణం మొదలైందని చెబుతుండటం విశేషం.