Zerodha: యువతకు నితిన్ కామత్ సూచన.. ముందున్నది మంచి కాలమే..
Nithin Kamath: భారతీయ యువత దేశంలో ఉండాలని జెరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ సూచించారు. ప్రతిభావంతులైన విద్యార్థుల వలసలు దేశానికి పెద్ద సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రెయిన్ డ్రెయిన్ నివారించాల్సిన అవసరం ఉందని అన్నారు.
|
భారత ప్రతిభ ప్రత్యేకం..
ప్రతిభవంతులైన భారతీయ యువతకు భవిష్యత్తులో అత్యుత్తమ అవకాశాలు లభించే అవకాశం ఉందని నితిన్ కామత్ తెలిపారు. 25 ఏళ్లలోపు ప్రతి ఐదుగురిలో ఒకరు భారతదేశానికి చెందినవారన్నారు. భారతీయ యువతకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని అన్నారు. మెరుగైన అవకాశాల కోసం యువత అభివృద్ధి చెందిన నగరాలకు, దేశాలకు వలస వెళ్లాలని కాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
|
నా మాట వినండి..
ప్రపంచవ్యాప్తంగా 25 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు భారతదేశానికి చెందిన యువతేనని కామత్ ట్విట్లో వెల్లడించారు. భారత యువతకు రానున్న కాలం స్వర్ణయుగమని, అత్యుత్తమ అవకాశాలు లభిస్తాయని ఒక ఛార్ట్ ను పొందుపరిచారు. తనను విద్యార్థులు సలహా అడిగితే వారిని దేశంలోనే ఉండమని చెబుతానని.. మేధావుల వలసను మనం నివారించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిని దేశం పట్ల బాధ్యతగా భావించాలని కామత్ అభిప్రాయపడ్డారు.
|
పొదుపు మంత్రం మంచిదే..
మెర్సెడిస్ బెంజ్ ప్రతినిధి భారతీయుల పొదుపు సూత్రాలపై కామెంట్ చేయటాన్ని తప్పుపట్టారు. భారతీయుల పొదుపుతత్వం ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి అండగా నిలుస్తుందని కామత్ అన్నారు. SIP పెట్టుబడులపై లగ్జరీ కార్ల తయారీదారు చేసిన కామెంట్ల కథనానికి సంబంధించిన పోస్టర్ పై కామత్ కామెంట్ చేశారు. భారీగా అప్పుల ఊబిలో చాలా దేశాలు కూరుకుపోతున్న తరుణంలో భారతీయుల పొదుపుతత్వం సహాయకారిగా నిలుస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఇది చాలా కీలకమన్నారు.
నిదానం మంచిదే..
నెమ్మదిగా, స్థిరంగా వృద్ధి చెందటం ఆర్థికానికి మంచిదని కామత్ అభిప్రాయపడ్డారు. విలువ క్షీణిస్తున్న ఆస్తులను కొనుగోలు చేసేందుకు ప్రజలు అప్పులు చేయటం, ఇలా అప్పులతో ఆర్థికాన్ని వృద్ధి చేసేందుకు ఊతంగా వినియోగించటం పెద్ద పేలుడుకు దారితీస్తుందని అన్నారు. ఈ విధానం దీర్ఘకాలంలో కస్టమర్లతో పాటు వ్యాపారులకు సైతం మంచిది కాదని కామత్ అభిప్రాయపడ్డారు.