అనిల్ అంబానీకి షాక్, ముంబై హెడ్ఆఫీస్ స్వాధీనానికి యస్ బ్యాంకు నోటీసులు
దాదాపు రూ.2.900 కోట్ల రుణాల రికవరీలో భాగంగా... అనిల్ అంబానీ గ్రూప్కు చెందిన ముంబై శాంతాక్రూజ్లోని హెడ్ ఆఫీస్తో పాటు దక్షిణ ముంబైలోని రెండు కార్యాలయాలను స్వాధీనం చేసుకునేందుకు యస్ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు రిలయన్స్ ఇన్ఫ్రాకు నోటీసులు ఇచ్చింది. ఈ కంపెనీ రూ.2,892 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఈ రికవరీలో భాగంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. ఎగవేతదారుల ఆస్తులను విక్రయించడానికి అనుమతించే ఓ చట్టంప్రకారం వీటిని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది.
74 లక్షల షేర్లు విక్రయించిన ఆదిత్యపురి, HDFC షేర్లు ఢమాల్! బ్యాంకు ఏం చెప్పిందంటే..
యస్ బ్యాంకుకు పెద్ద ఎత్తున రుణాలు
శాంతాక్రూజ్ ప్రధాన కార్యాలయంతో పాటు మరో రెండు కార్యాలయాలు దాఖలు పరచాలని యస్ బ్యాంకు.. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు పంపిన నోటీసుల్లో పేర్కొంది. ఇందులో భాగంగా నాగిన్ మహల్లోని రెండు ఫ్లోర్స్ను యస్ బ్యాంకు సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అనిల్ అంబానీ గ్రూప్కు యస్ బ్యాంకు రూ.12,000 కోట్ల రుణాలు ఇచ్చింది. ఈ ప్రధాన కార్యాలయం 21,432 చదరపు మీటర్ల స్థలంలో ఉంది. దీనిని రెండు దశాబ్దాల క్రితం బీఎస్ఈఎస్ నుండి కొనుగోలు చేసింది. బీఎస్ఈఎస్ని అనిల్ గ్రూప్ కొనుగోలు చేశాక రిలయన్స్ ఎనర్జీగా మార్చివేసి ఆ తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రాలో విలీనం చేశారు.
2 నెలల క్రితం నోటీసులు
2018లో శాంతాక్రూజ్లోని కార్యాలయానికి అనిల్ అంబానీ గ్రూప్ తరలి వెళ్లింది. గ్రూప్లోని ఫైనాన్షియల్ సర్వీసెస్కు సంబంధించిన రిలయన్స్ క్యాపిటల్, హౌసింగ్ ఫైనాన్స్తో పాటు జనరల్ ఇన్సురెన్స్ తదితర విభాగాలు ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇదివరకే మే 5న రుణాలు చెల్లించాలని రిలయన్స్ ఇన్ఫ్రాకు రెండు నెలల గడువుతో యస్ బ్యాంకు నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది. కంపెనీ రుణ చెల్లింపులను చేయకపోవడంతో ఆస్తులను సొంతం చేసుకునే దిశగా యస్ బ్యాంకు వెళ్తోంది.
గాడిన యస్ బ్యాంకు
బ్యాడ్ లోన్స్ కారణంగా యస్ బ్యాంకు ఇటీవల దివాళా పరిస్థితికి చేరుకున్న విషయం తెలిసిందే. ఎస్బీఐ ఈక్విటీ పెట్టుబడుల ద్వారా యస్ బ్యాంకులో మెజార్టీ వాటాను దక్కించుకుంది. అంతేకాదు, యస్ బ్యాంకు కార్యకలాపాలను గాడిన పెట్టేందుకు ఎస్బీఐ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అనిల్ అంబానీ గ్రూప్కు యస్ బ్యాంకు పెద్ద ఎత్తున రుణాలు అందించినట్లు గుర్తించింది. గత రెండు దశాబ్దాలుగా అనిల్ అంబానీ వ్యాపారాలు దూకుడుగా ఉన్నాయి. అయితే నష్టాల కారణంగా వివిధ ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న రుణాల చెల్లింపులకు జరపలేకపోయారు. గతంలో ఓ సమయంలో అన్న ముఖేష్ అంబానీ జైలుకు వెళ్లకుండా ఆదుకున్నారు.