షియోమీ సేల్స్ నెమ్మదించినా ప్రాఫిట్ అదుర్స్, రెవెన్యూలో శాంసంగ్ ఫస్ట్
గత ఏడాది భారత్లో షియోమీ సేల్స్ కాస్త తగ్గాయి. అయితే 2020లో లాభాలు మాత్రం ఎక్కువే ఉన్నాయి. 2019తో పోలిస్తే ఏడాది ప్రాతిపదికన సేల్స్ వృద్ధి 7 శాతం మాత్రమే ఉంది. వ్యాల్యూపరంగా ఇది రూ.38,196 కోట్లు లేదా 5.2 బిలియన్ అమెరికన్ డాలర్లు. వృద్ధి కాస్త మందగించినప్పటికీ కంపెనీ లాభాలు మాత్రం రూ.401 కోట్లు లేదా 55 మిలియన్ అమెరికన్ డాలర్లుగా నమోదయింది. అంతకుముందు ఏడాది మాత్రం రూ.148 కోట్లుగా ఉంది. అమ్మకపు వృద్ధి తగ్గడం వెనుక కారణాలు వెల్లడించాల్సి ఉంది.
సంస్థ మార్కెట్ షేర్ 26 శాతం
మిడ్ టు హై-ఎండ్ శ్రేణి స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీ మార్కెట్లో పట్టుసాధించడం, అత్యధిక మార్జిన్ లభించే వాటిపై కంపెనీ దృష్టి సారించడంతో సేల్స్ పెద్దగా పెరగనప్పటికీ, లాభాలు భారీగా పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రీమియం సెగ్మెంట్ నుండి భారీ ప్రాఫిట్ మార్జిన్ ఉందని చెబుతున్నారు. అయితే అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది మాత్రం సేల్స్ గ్రోత్ స్వల్పంగా తగ్గింది. అయినప్పటికీ భారత మార్కెట్లో అధిక వాటా షియోమీదే. ఈ సంస్థ మార్కెట్ షేర్ 2020లో 26 శాతంగా ఉంది.
ఆదాయం పరంగా శాంసంగ్ టాప్
ఆ తర్వాత వరుసగా శాంసంగ్, వివో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. శాంసంగ్ వాటా 21 శాతం, వివో వాటా 16 శాతంగా నమోదయింది. అయితే రెవెన్యూ పరంగా షియోమీ మూడో స్థానంలో ఉంది. శాంసంగ్, బీబీకే గ్రూప్(ఒప్పో, వన్ ప్లస్, రియల్మీ) తర్వాత ఉంది. ఒప్పో, వన్ ప్లస్, రియల్ మీ బ్రాండ్స్ విక్రయించే సంస్థ బిబికే గ్రూప్. మున్ముందు రెవెన్యూ పెంచుకునే ప్రయత్నాలు కొనసాగిస్తామని షియోమీ తెలిపింది.
10 మార్కెట్లలో నెంబర్ వన్
ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా టాప్ మూడో గ్లోబల్ స్మార్ట్ ఫోన్ కంపెనీగా షియోమీ ఉంది. రెడ్ మీ నోట్ సిరీస్ 200 మిలియన్ యూనిట్ల సేల్స్ను అందుకుంది. షియోమీ టాప్ 5లో 54 మార్కెట్లలో ఉంది, 36 మార్కెట్లలో టాప్ 3లో, 10 మార్కెట్లలో టాప్ 1గా ఉంది.