వొడాఫోన్ ఆందోళన: ఎయిర్టెల్-ఐడియా ఆర్థిక నష్టాలకు కారణాలివేనా?
పరిస్థితులు అనుకూలించకుంటే త్వరలో భారత్ మార్కెట్ నుంచి వైదొలగాల్సి రావొచ్చని సంకేతాలిచ్చింది వొడాఫోన్. భారత్లో మనుగడ సాగించలేమని, క్రిటికల్ పరిస్థితులు ఉన్నాయని కంపెనీ సీఈవో నిక్ రీడ్ అభిప్రాయపడ్డారు. భారత్లో తమ భవిష్యత్తుపై అనుమానమేనన్నారు. అధిక పన్నులు, చార్జీల భారాన్ని ఆపకుంటే కొనసాగలేమని స్పష్టం చేశారు. రిలయన్స్ జియో ఎంట్రీ, ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో టెలికం కంపెనీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఏజీఆర్ బకాయిలపై కంపెనీలు ఆందోళనగా ఉన్నాయి.
భారత్కు వొడాఫోన్ గుడ్బై? మా కంపెనీ పరిస్థితి ఆందోళనకరం: సీఈవో
పరిశ్రమపై భారం
ఏజీఆర్ పద్ధతిన లైసెన్స్, ఇతర ఫీజుల లెక్కింపుపై పదేళ్లుగా టెలికాం శాఖ, టెల్కోల మధ్య వివాదం ఉంది. ఈ వివాదంపై టెలీకమ్యూనికేషన్స్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపిలేట్ ట్రిబ్యునల్ టెలికాం కంపెనీలకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వెళ్లింది. అక్కడ టెలికం కంపెనీలకు షాక్ తగిలింది. లక్షకోట్లకు పైగా ఏజీఆర్ బకాయిలు.. అసలు, వడ్డీ, జరిమానా కలిపి చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో ఎయిర్ టెల్ రూ.21,700 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.28,300 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. జియో స్వల్పంగా చెల్లించవలసి ఉంటుంది. టెలికం రంగంపై మొత్తం రూ.1.4 లక్షల కోట్ల భారం పడింది.
ఆందోళన
ఈ నేపథ్యంలో టెలికం కంపెనీల భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. టెలికం పరిశ్రమ ఆర్థిక కష్టాలకు ధరల యుద్ధం ఓ కారణమని చెబుతున్నారు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో రాకతో ధరలు భారీగా తగ్గాయి. 4జీ సేవలతో సంచలన ఎంట్రీ ఇచ్చిన జియో భారత టెలికం ముఖ చిత్రాన్ని మార్చింది. ఉచిత సేవలు, చౌక ఇంటర్నెట్.. ఇలా ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలకు షాకిచ్చింది. దీంతో ఆ కంపెనీలకు కస్టమర్లు దూరమయ్యారు. ఈ కంపెనీలు కూడా ధరలు కొద్దిగా తగ్గించినా జియోతో పోటీ పడే పరిస్థితి లేదు.
అందుకే నష్టాలు..
ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు ఇంటర్నెట్ ప్యాకేజీ ధరలను తగ్గిస్తున్నాయి. వాయిస్ కాల్స్, మెసెజ్లు ఫ్రీగా ఇస్తున్నాయి. దీంతో ఆయా సంస్థలు నష్టాల్లోకి జారుకున్నాయి. జియో రాక అనంతరం జియో ఓ వైపు, ఇతర టెలికం సంస్థలు మరోవైపు అన్నట్లుగా కనిపిస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సాయం చేయాలని ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు విజ్ఞప్తి చేయగా, జియో దీనికి నో చెబుతోంది. ఏజీఆర్ పైన రివ్యూ కోసం ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు.
తగ్గిపోతున్న టెలికం సంస్థల సంఖ్య
టెలికం పరిశ్రమలో సంస్థల సంఖ్య తగ్గిపోతోంది. ఇదివరకు దేశవ్యాప్తంగా 15 వరకు సంస్థలు ఉండగా, ఇప్పుడు నాలుగుకు పడిపోయింది. రుణభారం, పెరిగిన పోటీ, జియో రాక వంటివి కూడా ఇందుకు కారణాలు. పోటీలో నిలదొక్కుకోవడానికి ఐడియా - వొడాఫోన్ కలిసిపోయాయి. కొన్ని విలీనమయ్యాయి. ఇప్పుడు ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా, జియో, బీఎస్ఎన్ఎల్ ఉన్నాయి. చాలా ప్రయివేటు కంపెనీలు ఎయిర్టెల్, వొడాఫోన్ సంస్థల్లోనే విలీనం అయ్యాయి. ఇప్పుడు వొడాఫోన్ కూడా గుడ్ బై చెప్పే అవకాశాలు లేకపోలేదు.