విజయ్ మాల్యా ఆస్తులు సీజ్ చేసిన ఫ్రాన్స్
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విదేశీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఫ్రాన్స్లోని రూ.14 కోట్ల విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సీజ్ చేసినట్లు ఈడీ ఇటీవల తెలిపింది. ఈడీ విజ్ఞప్తి నేపథ్యంలో ఫ్రాన్స్ అధికారులు ఈ ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఫ్రాన్స్లోని 32 అవెన్యూ ఎఫ్ఓసీహెచ్ వద్ద ఉన్న ప్రాపర్టీని జప్తు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. దీని విలువ 1.6 మిలియన్ యూరోలు (దాదాపు రూ.14 కోట్లు)గా పేర్కొన్నారు.
కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా నుంచి విదేశాలకు పెద్ద ఎత్తున నగదు మళ్లింపు జరిగినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ తెలిపింది. 2016 జనవరిలో దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు అటాచ్ చేసిన మాల్యా మొత్తం ఆస్తుల విలువ రూ.11,231.70 కోట్లకు చేరినట్లు తెలిపింది. బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన మాల్యా 2016లో దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన లండన్లో తలదాచుకున్నాడు.
మాల్యాను భారత్కు రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే లండన్ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన ష్రింగ్లా, యుకె హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ మధ్య గత నెలలో జరిగిన చర్చల సందర్భంగా అప్పగింత విషయాన్ని ప్రస్తావించింది.
2021 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్న బ్రిటిష్ ప్రధానిబోరిస్ జాన్సన్, విదేశాంగ కార్యదర్శి డొమినిక్తో ఈ అంశం ప్రస్తావనకు రానుందని భావిస్తున్నారు. కాగా, మాల్యాను భారత్కు అప్పగింత కేసుకు సంబంధించి యూకేలో పెండింగులో ఉన్న విచారణపై ఆరు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని గత నెలలో సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.