ఈ కంపెనీల్లో కొత్త ఉత్సాహం, కరోనా తర్వాత టూ-వీలర్ రెంటల్స్కు యమ డిమాండ్
కరోనా మహమ్మారి దరిరాకుండా చేయాలంటే ముఖ్యంగా సామాజిక దూరం పాటించాలి. ఇందులో భాగంగా ప్రకటించిన లాక్ డౌన్ రెండు నెలలకు పైగా కొనసాగుతోంది. దీంతో అన్ని రంగాలు సహా ఆటో సేల్స్ కూడా దారుణంగా పడిపోయాయి. అయితే ఇది తాత్కాలికమేనని ఆటో రంగాలు భావిస్తున్నాయి. సామాజిక దూరం వంటి అంశాల కారణంగా చిన్న కార్లు, టూ వీలర్స్కు డిమాండ్ పెరగుతుందని ఆటో రంగాలు భావిస్తున్నాయి.
COVID 19: వచ్చే ఏడాదికి ఇండియా పరుగు, ఎందుకంటే: దువ్వూరి
సెల్ఫ్ డ్రైవ్ స్కూటర్లకు డిమాండ్
ఆటోరంగంతో పాటు టూవీలర్ రెంటల్ స్టార్టప్స్ కూడా తమకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నాయి. బౌన్స్, వోగో, యూలు వంటి స్టార్టప్స్ సెల్ఫ్ డ్రైవ్ స్కూటర్ బిజినెస్లో ఉన్నాయి. కరోనా నేపథ్యంలో పబ్లిక్ ట్రాన్సుపోర్టుకు డిమాండ్ తగ్గుతుందని, అలాగే షేరింగ్కు కూడా ఆసక్తి చూపించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్సుపోర్ట్ గతంలో కంటే యాభై శాతాని కంటే ఎక్కువగా పడిపోతుందని భావిస్తున్నారు. వేతనాల్లో కోత, ఉద్యోగాల కోత కారణంగా క్యాబ్స్కు గతంలో చూపిన ఆసక్తి కనిపించదని చెబుతున్నారు.
పబ్లిక్ ట్రాన్సుపోర్టుకు ప్రత్యామ్నాయం
అంతిమంగా కొనుగోలు చేయాలనుకుంటే చిన్న కార్లు లేదా టూ వీలర్స్ వైపు మొగ్గు చూపుతారు. వీటితో పాటు సెల్ఫ్ డ్రైవ్ స్కూటర్ బిజినెస్ వ్యాపారం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. అందుబాటులో ధరలు, వాహనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకపోవడం, ఒక్కరే డ్రైవ్ చేసే వెసులుబాటు వంటి వివిధ కారణాల వల్ల గిరాకి పెరుగుతుందని భావిస్తున్నారు. పబ్లిక్ ట్రాన్సుపోర్టుకు ప్రత్యామ్నాయంగా తక్కువ ధరకు ఇవి అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.
సంసిద్ధం కావాలి
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సెల్ఫ్ డ్రైవ్ స్కూటర్లకు డిమాండ్ ఉంటుందని, కస్టమర్కు చౌక ధరతో ప్రయాణాన్ని ఈజీ చేస్తుందని బౌన్స్ సీఈవో వివేకానంద హల్లేకెరే అన్నారు. ప్రస్తుత అవసరాలకు తగినంతగా ఏయే నగరాల్లో ఏ మేరకు అవసరమనే అంశాలపై తాము సంసిద్ధం కావాల్సి ఉందని వోగో సీఈవో ఆనంద్ అయ్యాదురై తెలిపారు. సామాజిక దూరం, పరిశుభ్రత పాటించే సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడే స్థిరమైన మొబిలిటీ సొల్యూషన్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కూడా అన్నారు.
జీఎస్టీ తగ్గించాలని...
ఇటీవల బౌన్స్, వోగో కలిసి ఓ రిపోర్ట్ను తయారు చేసి ప్రభుత్వానికి అందించాయి. ఇందులో ప్రస్తుత పరిస్థితుల్లో వేగవంతమైన రవాణా సేవల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని, ఇందులో భాగంగా సెల్ఫ్ డ్రైవ్ స్కూటర్ వంటి వాటిపై జీఎస్టీని 28 శాతం నుండి సున్నా శాతానికి తగ్గించాలని నివేదికలో కోరాయి. కరోనా అనంతరం మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా పబ్లిక్ ట్రాన్సుపోర్ట్ను నవీనీకరించాలని సూచిస్తున్నాయి.