కేంద్రమంత్రి చెప్పింది నిజమే: టయోటా నో.. తర్వాత రూ.2000 కోట్ల పెట్టుబడి, ఎందుకు, ఏం జరిగింది?
భారత్లో తమ వ్యాపార విస్తరణ లేదని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ బుధవారం చెప్పినట్లుగా వార్తలు వచ్చిన, కాసేపట్లోని మళ్లీ లేదు.. లేదు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని ఈ ఆటో దిగ్గజం స్పష్టం చేసింది. టయోటా మోటార్స్ పన్నుల వంటి వివిధ కారణాలతో తొలుత పెట్టుబడులు పెట్టేది లేదని, చెప్పి అంతలోనే రూ.2000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామని చెప్పడం గమనార్హం. వచ్చే పన్నెండు నెలల్లో భారత్లో రూ.2000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామని టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ అన్నారు. అధిక పన్నుల కారణంగా భారత్లో విస్తరించబోమన్న కంపెనీ సీనియర్ అధికారి ప్రకటనను ఖండించారు.
అమెజాన్, ఫ్లిప్కార్ట్తో ఢీ! పండుగ టైంలో మేమూ ఆఫర్లు ఇస్తాం
అసలు ఏం జరిగింది?
కార్లు, మోటార్ బైక్స్ పైన ప్రభుత్వం పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో విస్తరణను నిలిపివేయనున్నట్లు కంపెనీ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దేశంలో కార్ల అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటానికి అధిక పన్నులు కారణమని శేఖర్ విశ్వనాథన్ అన్నారు. మార్కెట్ ఏమాత్రం పుంజుకున్నట్లు కనిపించినా ప్రభుత్వం పన్నుల భారం మోపుతోందన్నారు. భారీ పెట్టుబడితో ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసిన తర్వాత మీరు మాకు వద్దు అన్నట్లుగా ప్రభుత్వం వైఖరి ఉందని, కాబట్టి తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తరించే ఆలోచన లేదన్నారు.
ఇంతగా భారం ఎలా?
కార్లు, మోటార్ బైక్స్ పైన ప్రభుత్వ పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయని శేఖర్ విశ్వనాథన్ అన్నారు. వీటితో పాటు ఎస్యూవీలపై 28 శాతం జీఎస్టీతో పాటు వాహనాలను బట్టి 1 శాతం నుంచి 22 శాతం లెవీ విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులు ఎక్కువగా ఉండటంతో ధరలు పెరిగి కొనుగోలుదారులు కొనుగోళ్లకు ఎక్కువగా ముందుకు రావడం లేదన్నారు.
అవును.. నిజమే.. ఇన్వెస్ట్ చేస్తున్నాం
అయితే దీనిపై విక్రమ్ కిర్లోస్కర్ స్పందించారు. విద్యుత్ వాహనాల కోసం వచ్చే 12 నెలల్లో రూ.2,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. టయోటా కంపెనీ భారత్లో పెట్టుబడులు నిలిపివేయనుందనే వార్తలు అసత్యమని, వచ్చే ఏడాది కాలంలో రూ.2000 కోట్లు పెట్టుబడులు పెట్టనుందని కిర్లోస్కర్ తెలిపారని జవదేకర్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ పైన విక్రమ్ కిర్లోస్కర్ కూడా స్పందించారు. వాస్తవమేనని, విద్యుత్ విడిభాగాలు, టెక్నాలజీపై భారత్లో రెండువేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నామని, భవిష్యత్తు భారతానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. డిమాండ్ పెరుగుతోందని, మార్కెట్ క్రమంగా పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమకు, ఉద్యోగాలకు అవసరమైన మద్దతు ప్రభుత్వం ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.