పన్ను వసూళ్లు డౌన్: ఢిల్లీ సహా నగరాల్లో తగ్గగా, బెంగళూరులో మాత్రమే పెరిగాయి
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అంటే ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు పన్ను వసూళ్లు భారీగా తగ్గాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు మార్చి నుండి జూన్ వరకు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుండి క్రమంగా కోలుకుంటున్నాయి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ (15వతేదీ) వరకు పన్ను వసూళ్లు 22.5 శాతం మేర తగ్గినట్లుగా తెలుస్తోంది. గత ఏడాది ఇదే సమయంలో రూ.3,27,320.20 కోట్లుగా ఉండగా, ఈసారి రూ.2,53,532.30 కోట్లకు పడిపోయింది. దాదాపు రూ.74వేల కోట్లు క్షీణించాయి. ఈ మేరకు ఆదాయపు పన్ను విభాగంలోని ముంబై జోన్ వర్గాలు వెల్లడించాయి.
ట్రంప్ సహా ఎవరు వచ్చినా: ఇన్ఫోసిస్కు ఆ మూడు కొత్త ఉత్సాహం
వ్యక్తిగత పన్ను, కార్పోరేట్ పన్ను
ఈ పన్ను వసూళ్లలో ముందస్తు పన్నులు కూడా ఉన్నాయి. అయితే ముందస్తు పన్ను వసూళ్ల వివరాలను ప్రత్యేకంగా వెల్లడించలేదు. అయితే కరోనా వైరస్ కారణంగా ముందస్తు పన్నులు చెల్లించేవారు తగ్గిపోయారని చెబుతున్నారు. ఇందులో వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.1,47,004 కోట్లు వసూలుకాగా, కార్పోరేట్ ట్యాక్స్ రూ.99,126 కోట్లు వసూలైంది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో పన్ను వసూళ్లు 31 శాతం మేర తగ్గిన విషయం తెలిసిందే. అడ్వాన్స్ ట్యాక్స్లు ఏకంగా 76 శాతం మేర తగ్గాయి. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో వసూళ్లు పెద్ద మొత్తంలో తగ్గాయి.
ముంబైలో తగ్గుదల, బెంగళూరులో పెరుగుదల
రీజియన్స్ వారీగా పన్ను వసూళ్ల విషయానికి వస్తే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 13.9 శాతం మేర తగ్గగా, బెంగళూరు జోన్లో మాత్రం 9.9 శాతం మేర పెరగడం గమనార్హం. బెంగళూరులో గత ఏడాది ఇదే సమయంలో రూ.36,986 కోట్లు వసూలు కాగా, ఈసారి రూ.40,665 కోట్లకు పెరిగింది. పన్ను వసూళ్లు కోల్కతాలో 46.9 శాతం, చెన్నైలో 37.3 శాతం, ఢిల్లీలో 33 శాతం మేర క్షీణించాయి.
ముందస్తు వసూళ్లు..
అయితే సెప్టెంబర్ 15వ తేదీ నాటికి ఇది ప్రారంభ అంచనాలు అని చెబుతున్నారు. మొదటి క్వార్టర్లోను పన్ను వసూళ్లు తగ్గాయి. కార్పోరేషన్ అడ్వాన్స్ ట్యాక్స్ రూ.40,488 కోట్ల నుండి 40 శాతం మేర క్షీణించి రూ.8,572 కోట్లకు పడిపోయాయి. నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్లు రూ.1.37 లక్షల కోట్ల నుండి రూ.92,681 కోట్లకు తగ్గాయి. మొదటి క్వార్టర్లో ముంబైలో 78 శాతం, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్లలో 76 శాతం నుండి 84 శాతం మేర తగ్గాయి. అడ్వాన్స్ ట్యాక్స్ నాలుగు వాయిదాల్లో వసూలు చేస్తారు. జూన్ 15 (15 శాతం), సెప్టెంబర్ 15(45 శాతం), డిసెంబర్ 15(75 శాతం), మార్చి 15 ఉంటుంది.