ట్విట్టర్ కంపెనీలో అలజడి మెుదలైంది. ఎలాన్ మస్క్ ఇప్పటికే ఉద్యోగుల కోత ప్రారంభించినట్లు తెలుస్తోంది. కంపెనీలో నుంచి ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ సంస్థను విడిచిపెట్టి వెళ్లిపోతున్నట్టు ట్విట్టర్ తాజాగా వెల్లడించింది. దీనికి తోడు కొత్త నియామకాలు కూడా ఇప్పటికే నిలిచిపోయాయి. ఈ విషయాలపై కంపెనీ సీఈవో పరాగ్ సైతం స్పందించారు.

ట్విటర్లో ఉద్యోగస్తుల కోత
ట్విట్టర్ కంపెనీలోని రీసెర్చ్, డిజైన్ మేనేజర్ కేవోన్ బేక్పూర్తో పాటు ప్రాడక్ట్ హెడ్ బ్రూస్ ఫాల్క్ కంపెనీని వీడారు. రానున్న రోజుల్లో మరింత మంది కంపెనీని వీడతారా అంటే.. అందుకు అవుననే సమాదానం వస్తోంది. కంపెనీని వీడాలని తనకు లేనప్పటికీ.. ఇలా చేయక తప్పపటం లేదని కేన్ తన మదిలోని మాటను వ్యక్తం చేశారు. ట్విట్టర్ తో తన బంధాన్ని ఇలా ముగించాలని అనుకోలేదని ఆయన అన్నారు. ఇదే విషయంపై సీఈవో పరాగ్ సైతం తనతో మాట్లాడినట్లు ఆయన చెప్పారు.

కొత్త నియామకాలకు బ్రేక్
కంపెనీలోని కీలకమైన పదవులకు తప్ప.. మిగిలిన విభాగాల్లో నియామకాలు పూర్తి స్థాయిలో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్ వెల్లడించటం ఇప్పుడు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్ కొనుగోలు విషయంలో 44 బిలియన్ డాలర్ల డీల్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దీనిని పూర్తి స్థాయిలో ముగించే పనిలో పడ్డారు ఎలాన్ మస్క్.
ఇందుకు అవసరమైన ఫైనాన్స్ సమకూర్చుకుంటున్నారు. దానికోసం టెస్లా కంపెనీలోని తన వాటాలను సైతం తెగనమ్ముకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ట్విట్టర్ నుంచి మరింత ఆదాయం రాబట్టేందుకు ప్రణాళికలు సైతం ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు.

ఆందోళనలో ఉద్యోగస్తులు
ఏదేమైనా కంపెనీలో కీలకమైన విజయ గాదె, సీఈవో పరాగ్ అగర్వాల్ నుంచి కింది స్థాయి ఉద్యోగుల్లో సైతం ఆందోళనలు మెుదలైనట్లు తాజా పరిస్థితుల ప్రకారం తెలుస్తోంది. ట్విట్టర్ బోర్డును రద్దు చేస్తానని ఎలాన్ మస్క్ చేసిన సంచలన వ్యాఖ్యలు త్వరలోనే నిజమౌతాయని అందరూ ఆందోళన చెందుతున్నారు. కంపెనీ భవిష్యత్తు ఎలా ఉండనుందనేది మనమూ వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications