అబ్బే.. ఇవి అందులోకి రావు: కార్పొరేట్ పన్ను తగ్గింపుపై షాక్ ఇచ్చిన ఆర్థిక మంత్రి!
కార్పొరేట్ పన్ను తగ్గింపు విషయంలో కొన్ని రంగాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షాక్ ఇచ్చారు. సాఫ్ట్వేర్, మైనింగ్, పుస్తక ప్రచురణ కంపెనీలకు ఆ తగ్గింపు వర్తించదని స్పష్టం చేశారు. కార్పొరేట్ పన్నుల భారం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి గురువారం పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించి గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ట్యాక్సేషన్ లాస్ (అమెండ్మెంట్) బిల్లు, 2019కు పార్లమెంటు ఓకే చెప్పింది.
ఈ సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, తయారీ రంగంలో కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలకు 15 శాతం కార్పొరేట్ ట్యాక్స్ విధించే అంశంపై పూర్తి స్పష్టతనిచ్చారు. సాఫ్ట్వేర్ డెవలపింగ్ కంపెనీలు, మైనింగ్ కంపెనీలు, ప్రచురణ రంగంలోని వారికి 'కనిష్ట 15 శాతం పన్ను రేటు' వర్తించదని చెప్పారు.
నెగిటివ్ జాబితా తయారీ...
2019 ఆక్టోబరు 1వ తేదీ తర్వాత, 2023 సంవత్సరానికి ముందు కొత్తగా ఏర్పాటయ్యే తయారీ రంగంలోని కంపెనీలకు ప్రభుత్వం రాయితీ ధరపై 15 శాతం కార్పొరేట్ పన్ను ప్రకటించింది. ఈ రాయితీ పన్ను పరిధిలోకి రాని కంపెనీల జాబితా సవరణ బిల్లులో ఉన్నదన్నారు. ఈ రాయితీ వర్తించని కంపెనీల నెగిటివ్ జాబితాలో సాఫ్ట్వేర్ డెవలపింగ్ కంపెనీలు, మైనింగ్ కంపెనీలు, ప్రచురణ రంగం ఉన్నాయని సీతారామన్ వివరించారు.
ఇంకా మరికొన్ని కూడా...
రాజ్యసభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ప్రకారం- ట్యాక్సేషన్ చట్ట సవరణ బిల్లు 2019 ప్రకారం కొన్ని రంగాలను నెగిటివ్ జాబితా ఉంచారు. ఈ జాబితాలో ఉన్నవి తయారీ రంగం పరిధిలోకి రావు, వీటికి కనిష్ట 15 శాతం బేస్ రేటు వర్తించదు. వీటిలో కేవలం సాఫ్ట్వేర్ డెవలపర్లు, మైనింగ్ కంపెనీలు, బుక్ ప్రింటర్లు మాత్రమే కాదు.. శ్లాబుల్లో వినియోగించే మార్బుల్ బ్లాకులు, రీఫిల్ గ్యాస్ సిలిండర్లు, సినిమాటోగ్రాఫ్ ఫిల్మ్ కూడా ఉన్నాయి.
వృద్ధికి ఊతం, అభివృద్ధే లక్ష్యం...
దేశ ఆర్థిక రంగ వృద్ధికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని, అభివృద్ధే లక్ష్యంగా కార్పొరేట్ పన్ను తగ్గింపు చర్య తీసుకున్నామని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కార్పొరేట్ పన్ను తగ్గింపువల్ల పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ దేశంగా కనిపిస్తోందని వివరించారు. ఆర్థికరంగం పునరుత్తేజమే ధ్యేయంగా కేంద్రం తన చర్యలను కొనసాగిస్తుందని చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డీఐ) ప్రోత్సాహం, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, ప్రభుత్వ యంత్రాంగంలో అలసత్వ నిరోధం వంటి పలు చర్యలు కేంద్రం తీసుకుంటోందన్నారు.