తెలంగాణ ఆర్థిక పరిస్థితి సూపర్, ఆరేళ్లలో మోడీ ప్రభుత్వం ఇచ్చింది లక్షన్నర కోట్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన అనంతరం ఈ కొత్త రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయనే వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం వెల్లడించారు. తెలంగాణకు వివిధ పద్దుల కింద రూ.1,58,735 కోట్ల నిధులు విడుదలయ్యాయని, కేవలం 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చాక గత అయిదేళ్లలోనే రూ.1,41,735 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు.
టాప్ 20 స్మార్ట్ సిటీల్లో అమరావతి: విశాఖ-డయ్యూ సిస్టర్ సిటీలు
తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా లేదు
కాంగ్రెస్ లోకసభ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం లోకసభలో తెలంగాణ నిధులకు సంబంధించి ప్రశ్నించారు. దీనిపై నిర్మల సమాధానం ఇచ్చారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి, కేంద్రం స్పందన, గత ఆరేళ్లలో కేటాయించిన నిధులు, అదనపు నిధులు.. వంటి అంశాలపై ఆమె స్పందించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా లేదని చెప్పారు. తెలంగాణలో మొదటి నుంచి రెవెన్యూ మిగులు ఉంది.
అదనపు నిధులపై ఏమన్నారంటే
రాష్ట్ర బడ్జెట్ రికార్డ్స్ ప్రకారం 2014-15 నుండి రాష్ట్రం రెవెన్యూ మిగులులోనే ఉందని చెప్పారు. రుణ-జీఎస్డీపీ నిష్పత్తి గత ఆరేళ్లుగా పెరుగుతోందని, అది 14వ ఆర్థిక సంఘం నిర్దశించిన పరిమితులు, రాష్ట్ర ప్రభుత్వ మధ్యంతర ఆర్థిక విధాన ప్రకటన ప్రకారమే ఉందని చెప్పారు. అప్పులు పరిమితిలోనే ఉన్నాయన్నారు. తెలంగాణకు అదనపు నిధులు విడుదల చేయడం లేదన్నది అవాస్తవం అన్నారు.
గ్రాంట్లు విడుదల
కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రానికి గ్రాంట్లు విడుదల చేసినట్లు నిర్మల చెప్పారు. కేంద్రం విడుదల చేసిన నిధుల వినియోగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ధ్రవీకరణ పత్రాలను సంబంధిత మంత్రిత్వ శాఖలు, డిపార్టుమెంట్లు, నీతి అయోగ్ సాధారణ ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా పరిశీలిస్తాయన్నారు.
గత అయిదేళ్లలో..
కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లో ఉన్న గత అయిదేళ్లలో అత్యధికంగా గ్రామీణాభివృద్ధి కోసం రూ.3,853 కోట్లు, ప్రాథమిక, ఉన్నత విద్య, అక్షరాస్యతకు రూ.2,994 కోట్లు, పారిశుద్ధ్యం, తాగునీటి కోసం రూ.2,189 కోట్లు, వైద్య ఆరోగ్యం కోసం రూ.1,852 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.1,752 కోట్లు, వ్యవసాయం కోసం రూ.1,078 కోట్లు, మహిళా శిశు సంక్షేమం కోసం రూ.994 కోట్లు, జాతీయ రహదారుల కోసం రూ.763 కోట్లు, గిరిజనాభివృద్ధి కోసం రూ.456 కోట్లు, సామాజిక న్యాయం, సాధికారత కోసం రూ.388 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం రూ.296 కోట్లు విడుదల చేశారు.
లక్షన్నర కోట్లకు పైగా నిధులు..
13వ ఆర్థిక సంఘం చివరి ఏడాది, 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి గత అయిదేళ్లలో తెలంగాణకు వరుసగా రూ.16,999.86 కోట్లు, రూ.1,41,735.56 కోట్లు విడుదలయ్యాయి. మొత్తంగా రూ.లక్షన్నర కోట్లకు పైగా (రూ.1,58,735 కోట్లు) నిధులు వచ్చాయి.