ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త, రిటైర్మెంట్ వయస్సు పెంపు: కార్గోతో బోనస్ బంపరాఫర్!
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగుల సర్వీసును రెండేళ్లు పొడిగించింది. ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 సంవత్సరాలకు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఫైలుపై సంతకం చేశారు. దీనిపై ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది.
తల్లి ఆధారంగా జగనన్న అమ్మఒడి: మీరు అర్హులేనా.. ఇలా చెక్ చేయండి
ఉత్తర్వులు వచ్చాకే తేదీ.. అందరికీ పెంపు
ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లుగా ఉంది. దీనిని 60 ఏళ్లకు పెంచుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉత్తర్వులు వచ్చాకే ఏ నెల, ఏ తేదీ నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుందో తెలుస్తుంది. ఆర్టీసీలోని అధికారుల నుంచి శ్రామిక్ వరకు అన్ని స్థాయిల వారికి ఈ పెంపుదల వర్తిస్తుంది. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమైన సీఎం వారికి పదవీ విరమణ వయసు పెంచుతామని హామీ ఇచ్చారు.
వీరందరికీ ఎంతో ప్రయోజనం
పదవీ విరమణ పెంపు నిర్ణయంతో సూపర్ వైజర్ల నుంచి గ్యారేజీ వరకు... రానున్న అయిదేళ్లలో తొమ్మిది వేల మందికి పైగా ప్రయోజనం కలగనుంది. ఆర్టీసీలో ప్రస్తుతం దాదాపు 50 వేల మంది పని చేస్తున్నారు. ఈ సంవత్సరంలో 659 మంది పదవీ విరమణ చేశారు. 2020లో దాదాపు 2వేల మంది, 2021లో 2 వేల మందికి పైగా, 2022లో 2,360 మంది, 2023లో 2,325 మంది పదవీ విరమణ చేయాల్సి ఉంది.
ఆర్టీసీ కార్గో సర్వీస్
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్గో, పార్సిల్ సేవలు విస్తృత పరిచేందుకు వ్యూహం సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల ద్వారా జరిగే సరకు రవాణాను ఇక నుంచి ఆర్టీసీ కార్గో అండ్ పార్సిల్ సర్వీస్ ద్వారా చేస్తామని చెప్పారు. బతుకమ్మ చీరలు, స్కూల్స్కు పుస్తకాలు, డిపోల నుంచి షాప్స్కు మద్యం, ఆసుపత్రులకు మందులు లాంటివి ఆర్టీసీ పార్సిల్ నుంచే రవాణా చేయనున్నారు. ముంబై, బీవండీ, షోలాపూర్, నాగపూర్ వంటి ప్రాంతాలకు కూడా సరకు రవాణా చేయాలని సూచించారు. హైదరాబాదుతో పాటు ఇతర నగరాల్లో స్టాక్ పాయింట్లు పెట్టనున్నారు. ప్రభుత్వపరంగా ప్రతి సరకు రవాణా ఇకపై ఆర్టీసీ ద్వారానే జరిగేలా చూడనున్నారు.
కార్గోతో కేసీఆర్ బోనస్ ఆఫర్!
ప్రజలు తమ సరుకుల రవాణాకు ఇప్పటి వరకు ప్రయివేటు ట్రాన్సుపోర్ట్ను వినియోగిస్తున్నారు. ఇకపై ఆర్టీసీలోనే తమ సరుకును రవాణా చేసేలా ప్రోత్సహిస్తారు. నగరాలు, పట్టణాల నుంచి మారుమూల ప్రాంతాలకు సరుకు రవాణా చేసేందుకు అనుగుణమైన ఏర్పాట్లు చేస్తారు. సరుకు రవాణా ఎక్కువ చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు ఆర్టీసీ కూడా లాభాల బాట పడుతుంది. తద్వారా ఉద్యోగులకు బోనస్ ఇచ్చుకొనే పరిస్థితి ఉంటుంది. సరుకు రవాణా అంశంలో ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు. సరుకు రవాణాకు అనుగుణంగా బస్సులను సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారు.