మరోసారి కుదుపు! తెలంగాణలో లాక్డౌన్పై కీలక ప్రకటన?
కరోనా మహమ్మారి నేపథ్యంలో మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్, ఇతర ఆంక్షలు విధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోను కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ఇక్కడ లాక్డౌన్ విధించాలా వద్దా అనే అంశంపై తెలంగాణ కేబినెట్ రేపు (మంగళవారం, మే 11) నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు చీఫ్ మినిస్టర్ కార్యాలయం నుండి సోమవారం ఓ ప్రకటన వెలువడింది.
కరోనా ఉధృతి తగ్గడం లేదని, వివిధ రాష్ట్రాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయని దీంతో కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్, కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయని, అలాగే తెలంగాణ రాష్ట్రంలోను లాక్ డౌన్కు సంబంధించి వివిధ వర్గాలు, వ్యక్తులు, నిపుణుల నుండి భిన్నమైన సూచనలు, సలహాలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నంరెండు గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
అయితే, అంతకుముందు వారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలంగాణ వ్యాప్త లాక్డౌన్ వార్తలను కొట్టి పారవేశారు. పూర్తిస్థాయి లాక్ డౌన్ పెడితే కోట్లాదిమంది సామాన్య ప్రజలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. వారి బతుకులు కష్టంగా మారుతాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఉండదని వార్తలు వచ్చాయి. అయితే రేపు కేబినెట్ లాక్ డౌన్ పైన చర్చించి నిర్ణయం తీసుకోనుంది. లాక్ డౌన్ పెడితే మాత్రం తెలంగాణ సామాన్య ప్రజలు గతంలో వలె ఇబ్బందులు పడే పరిస్థితులు రావొచ్చు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడుతుంది. అయితే ప్రజల ప్రాణాలు కాపాడేందుకు లాక్ డౌన్ సరైన ఎంపిక అని కొందరు చెబుతున్నారు.