భారత్లో హువావే కార్యాలయాల్లో పన్ను అధికారుల తనిఖీలు
చైనా టెలికం దిగ్గజం హువావేకు చెందిన భారత్ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. కంపెనీ పన్ను ఎగవేతకు పాల్పడిందన్న ఆరోపణలపై దర్యాఫ్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు చెబుతున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు నగరాల్లోని హువావే కార్యాలయాల్లో మంగళవారం సోదాలు నిర్వహించారు. కంపెనీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, అకౌంట్ బుక్స్తో పాటు తదితర రికార్డ్స్ను అధికారులు తనిఖీ చేశారు. కొన్ని రికార్డ్స్ జఫ్తు చేసినట్లుగా తెలుస్తోంది.
దేశంలో తమ ఆఫీస్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల బృందం సందర్శించిందని, కంపెనీ ఉన్నతాధికారులను కలిసినట్లు తమకు సమాచారం అందిందని, అన్ని చట్టాలు, నిబంధనలకు కట్టుబడే భారత్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, మరింత సమాచారం కోసం సంబంధిత ప్రభుత్వ శాఖలను సంప్రదిస్తామని, నియమ నిబంధనలకు అనుగుణంగా తాము సహకరిస్తామని హువావే ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్లో 5G సేవల ట్రయల్స్ నిర్వహించేందుకు హువావేకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే, దేశీయ టెల్కోలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో భాగంగా తమ నెట్వర్క్ నిర్వహణ కోసం హువావే, జెడ్టీఈ నుండి టెలికాం గేర్లను సమీకరించేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. అయితే జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా టెలికాం రంగానికి జారీ చేసిన ఆదేశాల ప్రకారం హువావేతో కొత్త వ్యాపార అగ్రిమెంట్లు కుదుర్చుకునే ముందు దేశీయ ఆపరేటర్లు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలి.