Budget 2022-23: ఇక అందరికీ... ట్యాక్స్-ఫ్రీ ప్రావిడెంట్ ఫండ్ పరిమితి రూ.5 లక్షలకు!
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల 1వ తేదీన 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్లో వేతన జీవులకు పలు ఊరట ప్రకటనలు ఉండవచ్చుననే అంచనాలు ఉన్నాయి. వేతనజీవులకు అందరికీ ప్రావిడెంట్ ఫండ్లో పన్నురహిత కాంట్రిబ్యూషన్ పరిమితిని రెట్టింపు చేసి, ఏడాదికి రూ.5 లక్షల వరకు చేయవచ్చునని భావిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో సమానస్థాయికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయవచ్చునని అంటున్నారు.
పన్ను మినహాయింపు పరిమితి
గత కేంద్రబడ్జెట్(2021-22 ఆర్థిక సంవత్సరం)లో ట్యాక్స్-ఫ్రీ యాన్యువల్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ను రూ.2.5 లక్షలకు పరిమితం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కంపెనీ సహకారం లేని నిధులపై మాత్రం రూ.5 లక్షలకు ఇచ్చారు. ఈ మేరకు ఆర్థిక బిల్లులో సవరణలు చేశారు. అయితే ఈ సౌకర్యం అధిక పీఎఫ్ కాంట్రిబ్యూట్ చేసే తక్కువ మొత్తంలోని టాప్ ప్రభుత్వ అధికారులకు ప్రయోజనం చేకూర్చుతుంది. అయితే ఈసారి ఉద్యోగులందరికీ ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అందరికీ ఈ ప్రయోజనం
రిపోర్ట్స్ ప్రకారం ఈ నిబంధన కోసం వివిధ వర్గాల నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విజ్ఞప్తుల మేరకు ఈ ప్రయోజనాన్ని ఉద్యోగులు అందరికీ పొడిగించవచ్చునని చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ప్రాథమికంగా ఇది ప్రభుత్వ ఉద్యోగులకు, అదీ కొంతమందికి మాత్రమే ప్రయోజనం చేకూర్చుతుందని, ఈ నేపథ్యంలో అందరికీ ఈ ఫలం అందేలా ఈ బడ్జెట్లో పేర్కొనవచ్చునని చెబుతున్నారు.
బడ్జెట్ పైన ఎన్నో ఆశలు
నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. కరోనా పరిస్థితుల్లో వివిధ వర్గాలు, సామాన్యుల నుండి ఉద్యోగుల వరకు అందరూ ఎన్నో ఆశలతో ఉన్నారు. మహిళలకు, రియాల్టీ రంగాన్ని ప్రోత్సహించేందుకు, ప్రయివేటు ఉద్యోగులకు, అసంఘటిత రంగంలోని వారికి, చిన్న చిన్న వ్యాపారులకూ ఊతమిచ్చేలా చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.