అదే నిజమైతే ఉద్యోగుల్ని ఎప్పుడో తొలగించేవాళ్లం: టాటా మోటార్స్
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ఆటో ఇండస్ట్రీ తీవ్ర మందగమనంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆటో ఇండస్ట్రీలో వేలాది ఉద్యోగాలు పోయాయి. టాటా మోటార్స్ కూడా వర్క్ ఫోర్స్ను తగ్గిస్తుందనే వాదనలు వినిపించాయి. అయితే ఈ అంశంపై టాటా మోటార్స్ స్పందించింది. తమకు ఉద్యోగులను తొలగించే ఆలోచన ఏదీ లేదని పేర్కొంది. వర్క్ ఫోర్స్ తగ్గించే ఆలోచన ఉంటే ఇప్పటికే అమలు చేసి ఉండేవారమన్నారు.
ఈ కంపెనీ వెబ్ సైట్ ప్రకారం టాటా మోటార్స్లో కమర్షియల్, పాసింజర్ వెహికిల్స్ ఉత్పత్తి కోసం 83,000 వర్క్ ఫోర్స్ ఉంది. మందగమనం నేపథ్యంలో గత 12 నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఉద్యోగులను తొలగించాలనుకుంటే ఎప్పుడో తొలగించేవారమని తెలిపింది.
ముందు ముందు మరిన్ని ఉత్పత్తులను తీసుకు వస్తున్నామని, ఈ నేపథ్యంలో ఈ రంగం మళ్లీ పుంజుకుంటుందనే ఆశాభావంతో ఉన్నట్లుగా పేర్కొంది. టాటా మోటార్స్ నుంచి త్వరలో ఆల్ట్రోజ్, నెక్సాన్ ఈవీ, గ్రావిటాస్ ఎస్యూవీ వాహనాలు వస్తున్నాయి. దీంతో పాటు BS6 నిబంధనలకు అనుగుణంగా ఉత్పత్తిని మార్చుకోవాల్సి ఉందని పేర్కొంది.
తమకు కీలక విభాగమైన కమర్షియల్ వాహనాల విభాగాన్ని పటిష్ఠపరిచామని టాటా మోటార్స్ పేర్కొంది. మందగమన దశను ఇబ్బందులు లేకుండా దాటగలమని ధీమాగా ఉంది. కాగా, జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో గత ఏడాదితో పోలిస్తే 44% అమ్మకాలు తగ్గాయి. గత ఏడాది రూ.109.14 కోట్ల లాభాన్ని ఆర్జించగా, ఈ ఏడాది రూ.1,281 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.