ఈ నెలాఖరులోగా స్విస్ బ్యాంకు నుండి భారత్కు రియాల్టర్ల జాబితా!
స్విస్ బ్యాంకు నుండి ఈ నెల చివరి వరకు భారత్కు మరింత సమాచారం అందనుంది. అక్కడి బ్యాంకుల్లో భారతీయులకు ఉన్న ఖాతాలతో పాటు ఆ దేశంలో వారికి ఉన్న రియాల్టీ ఆస్తుల వివరాలు, వాటిపై వచ్చే ఆదాయ వివరాలను కూడా స్విస్ బ్యాంకులు ఈసారి భారత్కు అందనున్నాయి. స్విట్జర్లాండ్లో భారతీయులకు ఉన్న స్థిరాస్తుల వివరాలు, వాటిపై వచ్చే ఆదాయ వివరాలను ఆ దేశ బ్యాంకులు భారత్కు అందించడం ఇదే మొదటిసారి. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా స్విట్జర్లాండ్ బ్యాంకులు ప్రతి సంవత్సరం ఈ వివరాలు భారత్కు అందిస్తున్నాయి. అయితే ఆ దేశంలోని ఎన్జీవోలు, ఇతర సంస్థలకు భారతీయులు ఇచ్చే విరాళాలు, డిజిటల్ కరెన్సీల్లో పెట్టే పెట్టుబడుల వివరాలు ఈ ఒప్పందం పరిధిలోకి రావు.
స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు గల భారతీయులకు చెందిన మూడో జాబితా ఇది అవుతుంది. మూడో జాబితా ఈ నెలలో కేంద్ర ప్రభుత్వానికి అందుతుంది. 2 దేశాల మధ్య పరస్పర సమాచార మార్పిడి ఒప్పందానికి అనుగుణంగా భారత్కు స్విట్జర్లాండ్ ఈ జాబితా అందిస్తుంది. తొలిసారి స్విస్లో రియల్ ఎస్టేట్ ఆస్తులు, ప్లాట్స్, అపార్టుమెంట్స్, వాటిపై వచ్చే ఆదాయ వివరాల డేటా త్వరలో కేంద్రానికి అందుబాటులోకి రానుందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో వీటిపై వచ్చే ఆదాయంపై పన్ను ఎగవేత అంశాలపై దృష్టి సారించేందుకు వీలువుతుంది.
ఇదిలా ఉండగా, భారతీయులు, భారతీయ కంపెనీల సంపద స్విస్ బ్యాంకులో 2020 చివరి నాటికి వార్షిక ప్రాతిపదికన మూడు రెట్లు పెరిగి 2.55 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ లేదా రూ.20,700 కోట్లకు చేరుకుందని గతంలో ఓ నివేదిక వెల్లడించింది. రెండేళ్ల పాటు క్షీణించినప్పటికీ గత క్యాలెండర్ ఏడాదిలో మాత్రం నిధులు పెరిగాయి. తద్వారా గత ఏడాది 13 సంవత్సరాల గరిష్టానికి చేరుకున్నాయి. 2019 క్యాలెండర్ ఏడాది ముగిసే సమయానికి ఇండియన్స్, ఇండియన్ కంపెనీలు దాచుకున్న సొమ్ము విలువ దాదాపు రూ.6,625 కోట్లుగా నమోదయ్యాయి. బాండ్స్, ఇతర పథకాల్లో డిపాజిట్ చేసిన మొత్తం భారీగా పెరగడమే దీనికి కారణంగా తెలిపారు. కస్టమర్ డిపాజిట్లు మాత్రం 2020లో క్షీణించినట్లు స్విట్జర్లాంట్ సెంట్రల్ బ్యాంకు విడుదల చేసిన నాటి జాబితా ద్వారా వెల్లడైంది.
నల్లధనం నిల్వలను దాచుకునేందుకు స్విస్ బ్యాంకులు స్వర్గధామం అంటారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఫైనాన్సియల్ సెంటర్కు కీలకమన్న విశ్వాసాన్ని తిరిగి పొందాలని స్విట్జర్లాండ్ భావిస్తోంది. స్వచ్ఛంద సంస్థల సేవల సమాచారం, డిజిటల్ కరెన్సీల్లో పెట్టుబడుల వివరాలు భారత్కు అందుబాటులోకి వస్తాయి. దీంతో విదేశాలకు నల్లధనం తరలింపుకు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటంలో ఇది మైలురాయి అవుతుంది.