కార్లలో వాటిపైనే వినియోగదారుల మోజు... అవేమిటో తెలుసా?
సొంత కారు ఎంత హాయో కదా? మరి వాటి ఎంపికలో వినియోగదారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ధర తో పాటు కార్ల లో ఉండే ఫీచర్లు, వాటిలో లభించే సౌకర్యం, స్పీడ్, లుక్, ఇంటీరియర్స్ వంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. వీటితో పాటు పికప్, మైలేజ్ కీలకంగా ఉంటాయి. అయితే, కరోనా లాక్ డౌన్ తర్వాత వినియోగదారుల కొనుగోలు సరళి లో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోంది. సకల సదుపాయాలతో పాటు బెటర్ పికప్ ఉండే మోడల్స్ ను ఇష్టపడుతున్నారు. అందుకే, వారు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్ యూ వీ ) లపై మోజు పడుతున్నారు. ధర కాస్త అధికమైన పెద్దగా లెక్క చేయటం లేదు. అందుకే, మిగితా అన్ని కార్ల అమ్మకాల్లో క్షీణత కనిపిస్తే... దాదాపు అన్ని కార్ల కంపెనీలకు చెందిన ఎస్ యూవీల అమ్మకాల్లో మాత్రం వృద్ధి నమోదు అయింది. అది కూడా రెండంకెల వృద్ధి కనిపించటం విశేషం. ఈ కష్టకాలం లో ఎస్ యూ వీ ల అమ్మకాల జోరు ఇటీవల కాలంలో బాగా దెబ్బతిన్న ఇండియన్ ఆటోమొబైల్ రంగానికి కాస్త ఆశాదీపంగా కనిపిస్తోంది. ఈ సరళి ఇలాగే కొనసాగితే.. త్వరలోనే ఈ పరిశ్రమ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవాటం ఖాయంగా కనిపిస్తోంది.
జుకర్బర్గ్ పక్కావ్యూహం.. ఫేస్బుక్ గుత్తాధిపత్యం!? ఢీకొట్టేవారే లేరు
ఎస్ యూ వీ లు జూమ్...
జులై నెలలో జరిగిన కార్ల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే... దాదాపు అన్ని కార్ల కంపెనీల ఎస్ యూ వీ లకు గిరాకీ పెరిగినట్లు స్పష్టమవుతోంది. గతేడాది జులై నెలతో పోల్చితే ప్రస్తుత జులై నెలలో మొత్తం ఎస్ యూ వీ ల అమ్మకాల్లో 14% వృద్ధి నమోదు అయింది. దీంతో మొత్తం పాసెంజర్ కార్ల అమ్మకాల్లో ఎస్ యూ వీ ల వాటా కూడా గతంలోని 33% నుంచి 39% పెరిగింది. ఈ మేరకు ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. కానీ, ఇదే సమయానికి పాసెంజర్ కార్లలో ఎప్పుడూ ఊపు మీద ఉండే హాచ్ బ్యాక్, సెడాన్ కార్ల అమ్మకాలు క్షీణించాయి. గతేడాది జూలైతో పోల్చితే అమ్మకాల్లో 12% తరుగుదల నమోదు అయింది. అలాగే వ్యాన్లు వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు కూడా 19% తగ్గిపోయాయి. మరోవైపు అన్ని రకాల పాసెంజర్ వాహనాల అమ్మకాలు కూడా 4% పడిపోయాయి. కానీ, ఎస్ యూ వీ ల అమ్మకాల్లో వృద్ధి నమోదు కావటంతో గత నెలతో పోల్చితే తరుగుదల తక్కువగా ఉండటం విశేషం.
వాటికి యమా డిమాండ్...
ప్రస్తుతం దేశంలో ఎస్ యూ వీ అమ్మకాల్లో జోరు మీదున్న మోడల్స్ లో హ్యుండై క్రెటా మొదటి స్థానంలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇదే కంపెనీకి చెందిన వెన్యూ కూడా ఫరవాలేదనిపిస్తోంది. మరోవైపు కొరియా కార్ల కంపెనీ కియా మోటార్స్ కు చెందిన సెల్తోస్ కూడా దూసుకుపోతోంది. ఇక దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి కి చెందిన బ్రేజా, ఎర్టిగా కార్లు కూడా మాంచి ఊపు మీదున్నాయి. మహీంద్రా నుంచి ఇప్పటికీ వన్నె తగ్గని బొలెరో ఇప్పుడు కూడా మెరుగైన అమ్మకాలను నమోదు చేస్తోంది. మరోవైపు లగ్జరీ కార్ల విభాగం లో రూ 1 కోటి కి పైగా ధర పలికే మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ మోడల్ ఎస్ యూ వీ కారు కు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఈ అన్ని రకాల ఎస్ యూ వీ ల అమ్మకాల సరళి చూస్తే ఒక విషయం అర్థం అవుతోంది. వినియోగదారులు స్పష్టంగా తమ అభిరుచిని వీటితో చాటి చెప్పాలని చూస్తున్నారు.
అందుకే పెరుగుదల...
వినియోగదారులు స్టైలిష్ రూపంలో లభించే ఎస్ యూ వీ లపై మనసు పడుతున్నారు. అవి ఎక్కడికైనా, ఎలాంటి రోడ్ల పైనేనా దూసుకుపోగల సామర్థ్యం కలిగి ఉంటాయి. అలాగే, అధిక లగేజి పెట్టుకునే వీలు ఉండటం, సీట్ల మధ్య దూరం అధికంగా ఉండటం, ఎత్తైన బాడీ వల్ల ఎక్కువ దూరం ప్రయాణం చేసినా అలసిపోకుండా ఉండే సౌకర్యాలు వాటి సొంతం. చాలా ఎస్ యూ వీ ల్లో 4x4 సామర్థ్యం ఉండటం తెలిసిందే. దీంతో వినియోగదారులు ఎక్కడికైనా ప్రయాణం చేయగలిగే సదుపాయం లభిస్తుంది. కొండ ప్రాంతాలకు వెళ్లినా ఈజీ గా ప్రయాణం సాగిపోతుంది. అందుకే వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. కుటుంబ సభ్యులు అందరితో కలిసి పిక్ నిక్ లకు, దూర ప్రయాణాలకు ఇవి అత్యంత సౌకర్యంగా ఉంటున్నాయి. అందుకే, కంపెనీలు కూడా ఈ మోడల్స్ ను అధికంగా ఉత్పత్తి చేసే పనిలో పడ్డాయి. మారుతి బ్రేజా కు అయితే ఏకంగా ఉత్పత్తి సామర్థ్యం కన్నా అధిక ఆర్డర్లు లభిస్తున్నాయి. హ్యుండై క్రెటా కు కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే. అందుకే, వీటిని ఎక్కువ సంఖ్యలో మార్కెట్లో అందుబాటులో ఉంచే ప్రయత్నాల్లో కంపెనీలు నిమగ్నమయ్యాయి.