సోలార్ దిగుమతులు: మేకిన్ ఇండియా కంటే మేకిన్ చైనా ఎక్కువే
నరేంద్ర మోడీ ప్రభుత్వం మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ఓ యజ్ఞంగా భావించింది. అయితే సౌర విద్యుత్ పరికరాల దిగుమతులు ఇప్పటికీ 85 శాతం మూడు దేశాల నుంచి ఉండటం గమనార్హం. చైనా, వియత్నాం, మలేషియా దేశాల నుంచి వీటిని భారత్ దిగుమతి చేసుకుంటోంది. 2014 ఆర్థిక సంవత్సరం నుంచి సోలార్ ఫోటోవాల్టిక్ (PV) సెల్స్, మోడ్యుల్స్ దిగుమతుల వ్యాల్యూ 12.93 బిలియన్ డాలర్లు లేదా రూ.90,000 కోట్లుగా ఉంది. ఇందులో 85 శాతం చైనా, వియత్నాం, మలేషియా నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇది మేకిన్ ఇండియా ఉత్పత్తులతో సమానంగా ఉంది.
ఎన్నో రెట్లు ఎక్కువ
గత అయిదేళ్ల కాలంలో పునరుత్బాదక రంగంలోకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ (FDI)4.83 బిలియన్ డాలర్లు రాగా, పీవీ సెల్స్, మోడ్యూల్స్ దిగుమతులకు అంతకు మూడు రెట్లు (12.93 బిలియన్ డాలర్లు) ఉండటం గమనార్హం. ఇక 2014 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం పునరుత్బాదక రంగానికి కేటాయించిన బడ్జెట్ కంటే ఆరు రెట్లు ఎక్కువ. సోలార్ పరికరాలు దిగుమతి ఎక్కువగా ఉండటం విధాన వైఫల్యాన్ని చూపిస్తోందని అంటున్నారు. విధాన వైఫల్యం కారణంగా చైనా నుంచి ఎక్కువ దిగుమతులు ఉన్నాయని చెబుతున్నారు.
రాయితీలు ఇచ్చినా..
భారత్లో 3 గిగా వాట్ల ఫ్యాబ్రికేటింగ్ సోలార్ పీవీ సెల్స్, 10 గిగా వాట్ల మోడ్యూల్స్ ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉంది. పునరుత్పాదక రంగంలో 100 శాతం ఎఫ్డీఐలు అనుమతించినప్పటికీ ఇంటిగ్రేటెడ్ వంటి సౌకర్యాలు లేకపోవడంతో భారంగా మారుతోంది. సోలార్ పీవీ సెల్స్, మోడ్యూల్స్ ఉత్పత్తి కోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా మోడఫైడ్ స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజీ స్కీం (M-SIPS)ను కూడా తెచ్చింది. దీంతో మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెటప్ మూలధన వ్యయంలో 20-25 శాతం రాయితీ ఇస్తోంది.
175 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ కెపాసిటీ టార్గెట్
గత అయిదేళ్లలో భారత్లోకి వచ్చిన పవర్ సెక్టార్ FDIలలో సోలార్ రంగానికే ఎక్కువ. 2022 మార్చి నాటికి 175 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ కెపాసిటీని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 100 గిగావాట్లు సోలార్ రంగానిదే ఉంటుందని భావిస్తున్నారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ గణాంకాల ప్రకారం గత అయిదేళ్లలో సౌర విద్యుత్ దాని వ్యవస్థాపిత సామర్థ్యం 12 రెట్లు పెరిగి 31 గిగావాట్లకు చేరుకుంది. సోలార్ ప్రాజెక్టుకు ఉపయోగించే మెటీరియల్ క్వాలిటీ, ప్రాజెక్టు డెవలపర్స్ ఎక్కువగా దిగుమతిపై ఆధారపడటం వల్ల ఆశించిన మేర పెరగలేదని చెబుతున్నారు.