నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, రూ.1,000 కోట్లు చెల్లించిన వొడాఫోన్ ఐడియా, షేర్లు జూమ్
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ప్రారంభమై, అలాగే ముగిశాయి. ఉదయం గం.9.51 సమయానికి సెన్సెక్స్ 31 పాయింట్లు, నిఫ్టీ 9 పాయింట్లు కోల్పోయింది. సాయంత్రం గం.3.09 సమయానికి సెన్సెక్స్ 151.22 (0.37%) పాయింట్లు కోల్పోయి 41,171.78 వద్ద, నిఫ్టీ 46.35 (0.38%) పాయింట్లు నష్టపోయి 12,079.55 వద్ద ట్రేడ్ అయింది. టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్, ఎస్బీఐ, జీ ఎంటర్టైన్మెంట్, ఓఎన్జీసీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో సిప్లా, ఏషియన్ పేయింట్స్, హెచ్యూఎల్, టీసీఎస్, ఐవోసీ ఉన్నాయి.
వొడాఫోన్ ఐడియా AGR బకాయిలను రూ.1.000 కోట్లు చెల్లించింది. బకాయిలు చెల్లించిన వార్తల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు 4.95 శాతం లేదా 0.25 పైసలు పెరిగి రూ.4.45 వద్ద ట్రేడ్ అయింది. ఈ కంపెనీ షేర్లు బుధవారం కూడా 12 శాతం ఎగబాకాయి. రెండు రోజుల్లోనే ఈ కంపెనీ షేర్లు భారీగా లాభపడ్డాయి. కంపెనీ బకాయిలు చెల్లిస్తుందనే వార్తల నేపథ్యంలోనూ షేర్లు లాభపడుతున్నాయి.
వొడాఫోన్ ఐడియా మూతబడితే.. ఎయిర్టెల్, జియో పరిస్థితి ఇదీ
వోడాఫోన్ ఐడియా AGR బకాయిల చెల్లింపుల్లో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(DoT)కు గురువారం మరో రూ.1000 కోట్లు చెల్లించింది. AGR బకాయిలపై సుప్రీం ఆగ్రహం నేపథ్యంలో సోమవారం వోడాఫోన్ ఐడియా డీఓటీకు రూ.2500 కోట్లను చెల్లించింది. తాజాగా మరో వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించింది. DoT గణాంకాల బట్టి సవరించి స్థూల ఆదాయం లెక్కల ప్రకారం టెల్కో నుంచి లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీల బాకీల కింద వోడాఫోన్ ఐడియా రూ.53 వేలకోట్లు చెల్లించాల్సి ఉంది. భారతీ ఎయిర్ టెల్ రూ.10వేల కోట్లు చెల్లించిన విషయం తెలిసిందే.