ఆర్థిక రికవరీపై ప్రభావం, సెకండ్ వేవ్ పెను సవాల్: ఆర్బీఐ గవర్నర్
కరోనా సెకండ్ వేవ్ భారత్ను భయాందోళనకు గురి చేస్తోంది. పలు ప్రాంతాల్లో లాక్ డౌన్, ఆంక్షల నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలపై అనిశ్చితి కనిపిస్తోంది. ఈ అంశంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ గురువారం మాట్లాడారు. ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వృద్ధి అంచనాలపై అనిశ్చితి ఉన్నట్లు తెలిపారు. కరోనా కేసుల ఉధృతిని అదుపులోకి తీసుకు రాకుంటే అధి రికవరీపై ప్రభావం చూపుతుందని ఈ నెల ప్రారంభంలో జరిగిన MPC సమావేశం కూడా అంచనా వేసింది. కాబట్టి ద్రవ్యోల్భణం కంటే వృద్ధికే ప్రాముఖ్యతను ఇస్తున్నట్లు తెలిపింది. రెపో రేటును యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శక్తికాంతదాస్ మాట్లాడారు.
ITR Sahaj Form: ఐటీఆర్ సహజ్ ఫైలింగ్ అర్హత, ప్రాసెస్
రికవరీని కాపాడుకోవాలి
అంతర్లీనంగా సాగుతోన్న ఆర్థిక రికవరీని కాపాడుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని శక్తికాంత దాస్ అన్నారు. ఇలాంటి సమయంలో రికవరీకి సానుకూలంగా, మద్దతు పలుకుతూ సర్దుబాటు ధోరణిలో పరపతి విధానం అవసరమన్నారు. కుదేలైన ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ ముందుకు సాగడం కీలకమన్నారు. రికవరీకి తోడ్పడేలా ఊతమిచ్చే ధోరణిలో ద్రవ్య విధానం సానుకూలంగా ఉండాలన్నారు. ఫిబ్రవరి 2019 నుండి ఇప్పటి వరకు 250 బేసిస్ పాయింట్ల మేర కీలక రేట్లలో కోత పడింది.
ఎగుమతులు, పెట్టుబడుల వాతావరణానికి ఊతం
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్తో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్, ఇతర నియంత్రణల ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ పెరుగుదలపై అస్పష్టత నెలకొందన్నారు. అంతర్జాతీయ వృద్ధిరేటు ఆశాజనకంగా ఉంటుందనే అంచనాలు భారత్ ఎగుముతులు, పెట్టుబడుల వాతావరణానికి ఊతమిస్తాయన్నారు.
రికవరీ బలోపేతం
రికవరీ బలోపేతమయ్యేంత వరకు ఆర్థిక వ్యవస్థకు పరపతి విధానం మద్దతుగా కొనసాగాల్సిన అవసరం ఉందని డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర అన్నారు. ఇటీవల ద్రవ్యోల్బణం పెరిగిందని తెలిసినా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంపైనే దృష్టి ఉందన్నారు. కాగా, 2021-22 ఆర్ధిక సంవత్సరంలో వృద్ధి రేటును 10.5 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది.