ఏజీఆర్ బకాయిలను జియో ఎందుకు చెల్లించకూడదు: సుప్రీంకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో రిలయన్స్ కమ్యూనికేషన్స్కు సంబంధించి అడ్జెస్టెడ్ గ్రాస్ రెవిన్యూ (ఏజీఆర్) తప్పని సరిగా చెల్లించాలని సుప్రీంకోర్టు శుక్రవారం రోజున ఆదేశాలు జారీ చేసింది. 2016 నుంచి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్పెక్ట్రమ్ను జియో వినియోగిస్తున్నందున ఏజీఆర్ ఎందుకు చెల్లించకూడదని ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాదు దివాలా తీసిన టెలికాం కంపెనీలకు సంబంధించిన స్పెక్ట్రమ్ను ఎవరు వినియోగించుకున్నారో ధర్మాసనంకు తెలపాలని ఆదేశించింది. దివాలా తీర్మానం ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పలు కంపెనీలు నష్టాల్లో మునిగిన టెలికాం కంపెనీల స్పెక్ట్రమ్లను వినియోగించుకున్నాయి.
దివాలా తీసిన టెలికాం సంస్థల ఏజీఆర్పై విచారణ
నష్టాల బాటలో పయనించి దివాలా తీసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్కు జియో ఏజీఆర్ చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ కింద దాఖలైన పిటిషన్లను కోర్టు విచారణ చేసిన సమయంలో పై వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసింది.ఎయిర్సెల్ మరియు వీడియోకాన్లకు చెందిన స్పెక్ట్రమ్లను ఎవరు వినియోగిస్తున్నారని అత్యున్నత న్యాయ స్థానం ప్రశ్నించింది. 2016లోనే ఎయిర్సెల్కు చెందిన 4జీ ఎయిర్వేవ్ను ఎయిర్టెల్ కొనుగోలు చేసింది. ఇది 2300 మెగా హెర్ట్జ్ బ్యాండ్లో ఉంది. ఇక వీడియోకాన్ 4జీ స్పెక్ట్రమ్ను 1800 మెగా హెర్ట్జ్ బ్యాండ్ను కూడా ఎయిర్టెల్ కొనుగోలు చేసింది. ఈ మధ్య కాలంలోనే ఎయిర్సెల్ ఆస్తులను యూవీ ఎస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ కొనుగోలుకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆమోదం తెలిపింది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్పెక్ట్రమ్ వాడుతున్న జియో
ఇక రిలయన్స్ జియో రిలయన్స్ కమ్యూనికేషన్కు చెందిన స్పెక్ట్రమ్ వినియోగిస్తోందా అని ప్రశ్నించిన న్యాయస్థానం ఎప్పటి నుంచి వినియోగిస్తోందని ఆరా తీసింది. మొత్తం స్పెక్ట్రమ్లో ఓ భాగం ఖాళీగా ఉండగా మరో భాగమైన 800 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ను రిలయన్స్ జియోతో కలిపి పంచుకుంటున్నామని ఈ మేరకు 2016లోనే ఒప్పందం జరిగినట్లు కోర్టుకు వివరించారు రిలయన్స్ కమ్యూనికేషన్స్ తరపున న్యాయవాది శ్యామ్ దివాన్. అంతేకాదు మొత్తం ఏజీఆర్ జియో ఎందుకు చెల్లించకూడదో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. ఏజీఆర్ డ్యూస్ చెల్లించకుండా ఎలా తప్పించుకుంటారని జియోను ప్రశ్నించిన న్యాయస్థానం, స్పెక్ట్రమ్ను వినియోగిస్తున్న వారు తప్పకుండా ఏజీఆర్ చెల్లించాలని ఆదేశించింది.
జియో తరపున అడ్వకేట్ వాదనలు
ఇదిలా ఉంటే రిలయన్స్ జియో తరపున సీనియర్ అడ్వకేట్ కేవీ విశ్వనాథన్ వాదనలు వినిపించారు. వాణిజ్యం, భాగస్వామ్యం వేరని కోర్టు దృష్టికి తీసుకొచ్చిన విశ్వనాథన్... భాగస్వామ్యంలో కేవలం స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు మాత్రమే చెల్లిస్తామని చెప్పారు. అయితే దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చేందుకు కాస్త సమయం ఇవ్వాలని ఆయన న్యాయస్థానంను కోరారు. అంతేకాదు దివాలా దిద్దుబాటు ప్రక్రియ ద్వారా ఆర్కాంకు చెందిన స్పెక్ట్రమ్ను ఎవరు వినియోగిస్తున్నారో చెప్పాలని న్యాయస్థానం పేర్కొంది. ఇదిలా ఉంటే జియో మాత్రం తన సొంతంగా రూ.195 కోట్లు మేరా ఏజీఆర్ బకాయిలను చెల్లించింది. అయితే ఆర్కాం మాత్రం రూ.31వేల కోట్లు మేరా బకాయిలు చెల్లించాల్సి ఉంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్లో జియో 38శాతం స్పెక్ట్రమ్ వాటా కలిగి ఉంది. దీనికి స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలను చెల్లిస్తోంది.
ఏజీఆర్ బకాయిలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డ ధర్మాసనం ప్రభుత్వం కు సంబంధించిన ఏ బకాయిలైనా సరే త్వరతగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆమేరకు కోర్టు కూడా ఆదేశాలు ఇస్తుందని పేర్కొంది.