చైనాకు షాక్: శామ్సంగ్ యూనిట్ ఇండియా తరలింపు.. రూ.4 వేల కోట్లకు పైగా పెట్టుబడులు..
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కంపెనీ సామ్సంగ్ డ్రాగన్ చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశంలో గల మొబైల్, ఐటీ డిస్ప్లే ప్రొడక్షన్ యూనిట్ తరలిస్తామని తెలిపింది. నోయిడాలో ఏర్పాటు చేస్తున్నామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. శామ్సంగ్ కంపెనీకి తగిన వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. దేశంలో ఏర్పాటు చేసే మొదటి హై టెక్నిక్ ప్రాజెక్టు ఇదీ అని తెలిపారు. ప్రపంచంలో ఇప్పటివరకు రెండు యూనిట్లు ఉన్నాయని.. ఇదీ మూడో యూనిట్ అని వివరించారు.
నోయిడాలో ఏర్పాటు చేయబోయే యూనిట్తో 510 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. వందలాది మందికి పరోక్షంగా ఉపాధి కలగనుంది. ఇప్పటికే నోయిడాలో శామ్సంగ్ కంపెనీకి చెందిన మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. దీనిని 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
నోయిడాలో శామ్సంగ్ డిస్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్కు యూపీ ప్రభుత్వం శుక్రవారం అనుమతి ఇచ్చింది. ప్రోత్సాహకాలను కూడా ఇస్తామని ప్రకటించింది. యూనిట్ కోసం శామ్ సంగ్ కంపెనీ రూ.4 వేల 825 కోట్లను వెచ్చించనుంది. ఎకో విధానంలో డిస్ ప్లే యూనిట్ ఉంటుంది. దేశంలో మొబైల్ వినియోగం పెరుగుతోన్న క్రమంలో.. యూనిట్ నెలకొల్పడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
యూపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2017 పాలసీ ప్రకారం శామ్ సంగ్ కంపెనీకి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది. ప్రాజెక్టుకు ప్రభుత్వం ఐదేళ్లపాటు రూ.250 కోట్ల ఆర్థిక సదుపాయం కల్పిస్తోంది. అలాగే కేంద్ర ప్రోత్సాహకం కింద రూ.460 కోట్లు కూడా వర్తిస్తాయి.