చైనా షావోమీకి ఇండియాలో దెబ్బ, టాప్ ప్లేస్లోకి శాంసంగ్!
కరోనా మహమ్మారి ఆ తర్వాత గాల్వాన్ వ్యాలీలో చైనా దుందుడుకు చర్యలతో మెజార్టీ భారతీయులు చైనా వస్తువులను ఉపయోగించవద్దని నిర్ణయించారు. ఈ ప్రభావం ఇండియన్ హ్యాండ్సెట్ మార్కెట్లో స్పష్టంగా కనిపించింది. అంతకు ముందు చైనా కంపెనీలదే హవా. కొరియన్ ఫోన్మేకర్ శాంసంగ్ మూడో స్థానంలో నిలిచేది. అయితే ఇప్పుడు హ్యాండ్సెట్ మార్కెట్లో చైనాకు చెందిన షావోమీ దాటి మొదటి స్థానంలోకి దూసుకు వచ్చిందని ఇంటర్నేషనల్ డేటా కార్పోరేషన్ (IDC) తెలిపింది.
టిక్టాక్ ఇండియా కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ చర్చలు! ఒకవేళ అది సఫలం కాకపోయినా..
శాంసంగ్ టాప్.. వాటిలో ఇంకా వెనుకంజ
ఏప్రిల్-జూన్ క్వార్టర్లో మొత్తం భారత మొబైల్ మార్కెట్లో శాంసంగ్ అగ్ర స్థానంలో నిలిచింది. ప్రధానంగా గెలాక్సీ ఎం21 స్మార్ట్ ఫోన్ టాప్ 5 మోడళ్లలో ఒకటిగా నిలిచింది. ఫీచర్ ఫోన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్ 24 శాతం వాటాతో షావోమీ, వివో కంటే వెనుక ఉంది. ఆన్లైన్ వ్యాపారంలో రెండో స్థానంలో ఉంది. స్మార్ట్ ఫోన్లకు సంబంధించి షావోమీ కంటే వెనుకబడి ఉన్నప్పటికీ జూన్ త్రైమాసికంలో 26.3 శాతం మార్కెట్ను సాధించడం ద్వారా అంతరాన్ని భారీగా తగ్గించింది. అంతకుముందు క్వార్టర్లో 15.6 శాతం మాత్రమే. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో షియోమీ 29.5 శాతం, శాంసంగ్ 26.3 శాతం, వివో 17.5 శాతం వాటాను కలిగి ఉంది.
శాంసంగ్ తాత్కాలికమే కావొచ్చు..
ఓవరాల్ హ్యాండ్సెట్ మార్కెట్లో శాంసంగ్ తొలి స్థానంలో నిలిచినప్పటికీ ఇది తాత్కాలికమే కావొచ్చునని IDC ఇండియా రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ అన్నారు. శాంసంగ్ అమ్మకాలు పెరగడానికి గత క్వార్టర్లో చైనా ఆధారిత స్టాక్స్ కొరత ఓ కారణంగా చెబుతున్నారు. అలాగే చైనా వ్యతిరేక సెంటిమెంట్ కూడా కలిసి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. కరోనా, సప్లై చైన్ ఇబ్బంది వంటి పరిస్థితులు లేకుంటే వివో సులభంగా రెండో స్థానానికి చేరుకుంటుందని చెప్పారు.
దాదాపు సగం పడిపోయిన షావోమీ షిప్మెంట్స్
వ్యాల్యూమ్ పరంగా షావోమీ షిప్మెంట్స్ 48.7 శాతం పడిపోయి 5.4 మిలియన్ యూనిట్లుగా ఉన్నాయి. Redmi Note 8A Dual, Note 8, Note 9 Pro, and Redmi 8 స్మార్ట్ ఫోన్ మోడల్స్ సేల్స్ ఇందులో 21.8 శాతం వాటాను కలిగి ఉన్నాయి. నాలుగో స్థానంలో ఉన్న రియల్మీ సేల్స్ ఈ క్వార్టర్లో 37 శాతం పడిపోయి 1.78 యూనిట్లకు పరిమితమయ్యాయి. అఫొర్డబుల్ C3/C2 డివైస్ల వాటా 36.3 శాతం కాగా, కొత్తగా లాంచ్ చేసిన Narzo సిరీస్ ఆ తర్వాత స్థానంలో ఉంది. ఐదో స్థానంలో ఉన్న మరో చైనా కంపెనీ ఒప్పో సేల్స్ కూడా 51 శాతం పడిపోయి 1.76 మిలియన్ యూనిట్లుగా ఉంది.
క్షీణించిన సేల్స్
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ 2019 జూన్ క్వార్టర్తో పోలిస్తే ఈ ఏడాది అదే క్వార్టర్లో 50.6 శాతం పడిపోయింది. గత ఏడాది 36.8 మిలియన్ సేల్స్ ఉండగా, ఈసారి 18.2 మిలియన్లకు పరిమితమయ్యాయి. 2020 రెండో అర్ధ సంవత్సరం రికవరీ అవుతుందని IDC భావిస్తోంది. ఆన్లైన్ మార్కెట్ 44.8 శాతంగా ఉన్నప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే 39.9శాతం పడిపోయింది. ఫీచర్ ఫోన్ షిప్మెంట్స్ ఏడాది ప్రాతిపదికన 69 శాతం పడిపోయాయి. ఓవరాల్ మొబైల్ మార్కెట్లో దీని వాటా 35.5 శాతం.