ప్రభుత్వానికి ఆ కుటుంబం 10.8 బిలియన్ డాలర్ల వారసత్వ పన్ను
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ మాజీ చైర్మన్ లీ కున్ హీ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ పన్ను కింద స్థానిక ప్రభుత్వానికి 10.78 బిలియన్ డాలర్లు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా లీ కున్ హీ వదిలి వెళ్లిన ఆస్తుల వ్యాల్యీలో సగానికి పైగా వారసత్వ పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించనుంది. ఈ చెల్లింపు ప్రక్రియ తర్వాత ప్రపంచంలో అత్యధిక వారసత్వ పన్ను చెల్లించిన వారిగా శాంసంగ్ వారసులు నిలుస్తారు. పెద్ద మొత్తంలో హెల్త్ కేర్ కోసం, ఆర్ట్ డొనేషన్ కోసం ఖర్చు చేయనుంది.
వారసత్వ పన్ను
లీ కున్ హీ గత ఏడాది అక్టోబర్ నెలలో మరణించారు. దక్షిణ కొరియాలో వీరిది అత్యంత పవర్ఫుల్ ఫ్యామిలీ. దేశంలోని అత్యంత సంపద కలిగిన ఈ ఆస్తులకు సంబంధించి ట్యాక్స్ అధికారులు ఆరు నెలల గడువు ఇచ్చారు. 20 బిలియన్ డాలర్ల సంపదపై సగానికి పైగా వారసత్వ పన్ను అంశం కూడా ఉంది. ప్రపంచంలోని అత్యధిక వారసత్వ పన్ను రేట్లు ఉన్న దేశాల్లో దక్షిణ కొరియా ఉంది. వారసులకు ఆస్తి బదలీ అయ్యే సమయంలో 50 శాతం పన్ను రూపంలో చెల్లించాలి.
ఆయన హయాంలోనే దిగ్గజ కంపెనీగా
ఇప్పుడు లీ కున్ హీ వారసులు చెల్లించనున్న పన్ను దక్షిణ కొరియాలో గత ఏడాది వసూలు చేసిన ఆస్తి పన్ను కంటే నాలుగు రెట్లు కావడం గమనార్హం. ఏప్రిల్ 2021 నుండి రానున్న అయిదేళ్లలో ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. లీ కున్ హీ హయాంలోనే శాంసంగ్ అతిపెద్ద సంస్థగా ఎదిగింది.
ఇలా చెల్లింపు
డివిడెండ్స్తో పాటు బ్యాంకు రుణాల ద్వారా ప్రభుత్వానికి ఈ మొత్తాన్ని చెల్లించనుందని తెలుస్తోంది. అలాగే లీ కున్ హీ వదిలి వెళ్లిన ఆస్తిని వారసుల మధ్య ఎలా పంచుకోనున్నారో వెల్లడించాల్సి ఉంది. 0.9 బిలియన్ డాలర్లను ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల బలోపేతానికి ఇవ్వనున్నారు. లీ సేకరించిన విలువైన పెయింటింగ్స్, పురాతన వస్తువులను జాతీయ మ్యూజియంకు ఇవ్వనున్నారు.