Covid-19: ఫస్ట్టైం కారు కొనేవాళ్లు పెరుగుతున్నారు, వాటిపైనే ఆసక్తి
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటించేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రయాణం కోసం ప్రజారవాణా కంటే వ్యక్తిగత వాహనాలు కోసం మొగ్గు చూపుతున్నారు. దీంతో బైక్ సేల్స్తో పాటు కుటుంబ సభ్యులు ఒకే వాహనంలో ప్రయాణించేలా కారు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. జూలై నెలలో సేల్స్ మెరుగైన విషయం తెలిసిందే.
ఆటోరంగం గుడ్న్యూస్! పెరుగుతున్న కార్లు, బైక్స్ కొనుగోళ్లు.. ఎందుకంటే
పెరుగుతున్న మొదటిసారి కారు కొనుగోలుదారులు
కరోనా కారణంగా తొలిసారి కారును కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోందని శ్రీవాస్తవ తెలిపారు. వ్యక్తిగత ప్రయాణ సాధనాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులోనూ మొదటిసారి కారును కొనుగోలు చేసే వారి శాతం పెరిగిందని, ఇందుకు జూలై నెలలో విక్రయాలే నిదర్శనమన్నారు. ఎక్స్చేంజ్ లేదా రీప్లేస్మెంట్ కొనుగోళ్లు తగ్గుముఖం పట్టినట్లు చెప్పారు. మరోవైపు ఇప్పటికే కారు ఉన్నవారు అదనంగా మరో కారును కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజారవాణాకంటే వ్యక్తిగత వాహనాలతో భద్రతను కోరుకుంటున్నారన్నారు. అందుకే పాసింజర్ కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. డొమెస్టిక్ పాసింజర్ వెహికిల్ సేల్స్ 2019 జూలైలో 96,478 కాగా, ఈసారి 1.3 శాతం పెరిగి 97,768గా ఉన్నాయి.
ఆదాయాలు తగ్గడంతో... ఆ పరిమితికి లోబడి కొనుగోలు
జూలైలో అమ్మకాలు మెరుగుపడటంతో పాటు రాబోయే పండుగ సీజన్లో విక్రయాలను బట్టి వాహన రంగ దీర్ఘకాల భవిష్యత్తు అంచనా వేసుకోవచ్చునని చెప్పారు. కరోనా దెబ్బతో ప్రజల ఆదాయస్థాయిల్లో కొంతమేర మార్పులు వచ్చాయని, దీంతో వారిపై ఒత్తిడిపడిందని, అందుకే ఆదాయ పరిమితులకు తగిన విధంగా వాహనాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
తొలిసారి కారుకొనుగోళ్ల పెరుగుదల శాతం
గత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్తో పోలిస్తే ప్రస్తుత జూన్ త్రైమాసికంలో తొలిసారి కారును కొనుగోలు చేసిన వారి వాటా 5.5 శాతం పెరిగి 51-53 శాతానికి చేరుకుందని తెలిపారు. ఇదే సమయంలో ఎంక్వైరీలు కూడా కరోనా ముందున్న స్థాయిల్లో 85-90 శాతానికి చేరుకున్నాయన్నారు. ఈ ఎంక్వైరీల్లో 65 శాతం మినీ, కాంపాక్ట్ విభాగాల కార్ల కోసం చేసినవేనని తెలిపారు. గతంలో ఇది 55 శాతంగా ఉండేదని తెలిపారు. జూలైలో ఆల్టో, ఎస్-ప్రెస్పో వంటి చిన్న కార్ల విభాగం అమ్మకాలు 49.1 శాతం అధికమైన 17,258కి చేరాయని, 2019 జూలైలో ఈ సంఖ్య 11,577 మాత్రమేనని చెప్పారు. వ్యాగనార్, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి కాంపాక్ట్ కార్ల సేల్స్ మాత్రం 10 శాతం తగ్గాయన్నారు. గత ఏడాది జూన్ క్వార్టర్లో 57,512 యూనిట్లు కాగా ఈసారి 51,529గా ఉన్నాయి.