Retrospective tax policy: ఎన్డీయే ఏం చెబుతోంది, ఏమిటిది?
రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ పాలసీకి(వెనకటి తేదీ నుండి పన్ను చెల్లించాలనే నోటీసులు) స్వస్తీ పలకాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వొడాఫోన్ - కెయిర్న్ ఎనర్జీ కేసులో వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించిన పన్ను చట్టానికి సవరణలు చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోకసభలో ది ట్యాక్సేషన్ లాస్(అమెండ్మెంట్) బిల్, 2021ని ప్రవేశ పెట్టారు.
దీని ద్వారా 2012 మే 28వ తేదీకి ముందు జరిగిన భారత ఆస్తుల పరోక్ష బదలీ ట్రాన్సాక్షన్ పైన జారీ చేసిన పన్ను నోటీసులను వెనక్కి తీసుకోవచ్చు. ఈ కేసుల్లో ఏవైనా రీఫండ్ మొత్తాలు ఉన్నప్పటికీ, వాటిని వడ్డీ లేకుండా చెల్లించే వెసులుబాటును కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ తరహాలో వసూలు చేసిన రూ.8100 కోట్లను తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఏమిటీ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ పాలసీ, ఎన్ని కేసులు?
ఈ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ను ఎన్డీయే ట్యాక్స్ టెర్రర్గా పేర్కొంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటోంది. తద్వారా 2012లో యూపీఏ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ చట్టాన్ని సరిదిద్దుతున్నట్లు తెలుపుతోంది. గతంలో చేసిన ట్రాన్సాక్షన్స్ పైన అదనపు ఛార్జీ చట్టం ఇది. గతంతో పోలిస్తే ప్రస్తుత విధానాలు చాలా భిన్నంగా ఉన్నాయి. అలాంటి సందర్భాలలో ఛార్జ్ చేస్తారు. పాత పాలసీ కింద తక్కువ పన్ను ఉంటుందని భావించవచ్చు. వెనుకడి తేదీ నుండి పన్ను విధించే చట్ట పరిధిలో మొత్తం పదిహేడు కంపెనీలకు రూ.1.1 లక్ల కోట్ల విలువైన పన్ను నోటీసులను పంపించింది.
ఈ రెట్రో ఎప్పుడు ప్రారంభించారు?
2007లో హచిసన్తో జరిగిన ట్రాన్సాక్షన్ విషయంలో తాము ఎలాంటి పన్ను కట్టక్కరలేదని ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలను వొడాఫోన్ గ్రూప్ ఉటంకించడం సమర్థనీయమేనని 2012లో సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. నాటి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక చట్టానికి సవరణ చేస్తూ వెనకటి తేదీ ఒప్పందాలకు కూడా పన్ను విధించే అధికారాన్ని ఆదాయపు పన్ను విభాగానికి ఇచ్చారు.
ఆ చట్టం అదే ఏడాది అంటే 2012లో పార్లమెంటులో ఆమోదం పొందింది. దీంతో వొడాఫోన్కు 2013లో రూ.14,200 కోట్ల పన్ను నోటీసులు(రూ.7990 కోట్ల అసలు, మిగతా వడ్డీ) జారీ చేశారు. 2016 ఫిబ్రవరికి ఇది రూ.22,100 కోట్లకు చేరుకుంది. కెయిర్న్ ఎనర్జీ 2006-07లో మన దేశంలో వ్యాపారాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా చేసిన షేర్ల బదిలీకీ ఇదే చట్టాన్ని వినియోగించారు. 2014 జనవరిలో రూ.10,247 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసులు ఇచ్చారు ఆ సంస్థకు. అపరాధ రుసుంతో కలిపి రూ.20,495 కోట్లకు చేరుకుంది. ఈ రెండు కేసుల్లో, ఆయా సంస్థలు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్లో గెలిచాయి. 2011లో కెయిర్న్ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేసిన వేదాంతాపై పన్ను విధించారు. ఈ కేసు విషయమై ఆర్బిట్రేషన్ తీర్పు రావాల్సి ఉంది.
అందుకే ఈ బిల్లు
కొన్నేళ్లుగా ఆర్థిక, మౌలిక రంగాల్లో ప్రధాన సంస్కరణలను ప్రవేశపెట్టామని, దేశంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణాన్ని సృష్టించగలిగామని, అయితే వెనకటి తేదీ నుంచి పన్ను చెల్లించాలని నోటీసులు ఇస్తుండటం పెట్టుబడుదార్లకు ఇబ్బందిగా మారిందని నిర్మలా సీతారామన్ అన్నారు. కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవాల్సిన సమయంలో, వేగవంతమైన వృద్ధికి, ఉపాధికి విదేశీ పెట్టుబడులు అత్యంత కీలకమని తెలిపారు. అందుకే ఈ బిల్లును ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు.