సరళీకరణకు ముందు.. తర్వాత: భారత ఆర్థిక వ్యవస్థకు ప్రణబ్ ముఖర్జీ అండ
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం (ఆగస్ట్ 31) తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్, రెఫరెల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న మాజీ రాష్ట్రపతి ఆగస్ట్ 10వ తేదీ నుండి ఆసుపత్రిలోనే ఉన్నారు. మెదడులో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించిన వైద్యులు ఆపరేషన్ చేశారు. కరోనా కారణంగా ఆ తర్వాత పాజిటివ్ వచ్చింది. దీంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంచి ఆర్థికవేత్తగా అందరి మన్ననలు అందుకున్నారు. ఇందిరా గాంధీ హయాంలో, మన్మోహన్ సింగ్ హయాంలో ఆర్థికమంత్రిగా సేవలు అందించారు.
ఆర్థికమంత్రిగా....
ఇందిరా గాంధీ హయాంలో 1982 జనవరి నుండి 1984 డిసెంబర్ వరకు ఆర్థికమంత్రిగా పని చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలోనూ 2009 జనవరి నుండి 2012 జూన్ మధ్య రెండోసారి ఆర్థికమంత్రిగా విధులు నిర్వర్తించారు. సరళీకరణ ఆర్థిక విధానాలకు ముందు, ఆ తర్వాత ఆర్థికమంత్రిగా విధులు నిర్వర్తించిన వారు ముఖర్జీ. 1982-83లో తొలి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్బీఐ గవర్నర్గా మన్మోహన్ సింగ్ నియామక పత్రంపై సంతకం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు మొట్టమొదటి సంస్కర్తగా ప్రణబ్ గుర్తింపు పొందారు. ఇందిర హయాంలో ప్రపంచ అత్యుత్తమ ఆర్థికమంత్రిగా యూరోమనీ మేగజైన్ సర్వేలో గుర్తించబడ్డారు.
జీడీపీలో బడ్జెట్ లోటు
పీవీ నర్సింహా రావు హయాంలో ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా నియమితులయ్యారు ప్రణబ్ ముఖర్జీ. ఈ కాలంలోనే మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రిగా ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. లైసెన్స్ రాజ్ వ్యవస్థకు ముగింపు పలికారు. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడింది. ఆ తర్వాత 2009లో మరోసారి ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ప్రణబ్. 2009, 2010, 2011 బడ్జెట్లు ప్రవేశ పెట్టారు. 2008-09లో 6.5 శాతం నుండి 2010-11 బడ్జెట్లో జీడీపీ అనుపాతంగా ప్రజా రుణాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2012-13 సంవత్సరం నాటికి జీడీపీలో బడ్జెట్ లోటును 4.1 శాతానికి తగ్గించారు. ఇది
అనేక సంస్కరణలు
ప్రణబ్ ముఖర్జీ అనేక సంస్కరణలు చేపట్టారు. అతను ఫ్రింజ్ బెనిఫిట్స్ ట్యాక్స్, కమోడిటీస్ ట్రాన్సాక్షన్స్ను రద్దు చేశారు. తన పదవీ కాలంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ పన్నును అమలు చేశారు. రెస్టోస్పెక్టివ్ పన్నులను పరిచయం చేశారు. దీనిపై కొంతమంది ఆర్థికవేత్తలు పెదవి విరిచారు. అక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ కోసం బడ్జెట్లో పెంచారు. ఎదుగుతున్న మార్కెట్కు సంబంధించి 2010లో ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ ఫర్ ఆసియా అవార్డు అందుకున్నారు.
వీటి ఏర్పాటులో కీలక పాత్ర
2009-10 బడ్జెట్లో సీనియర్ సిటిజన్లకు, మహిళలకు ఆదాయపు పన్ను పరిమితి ఊరట కల్పించారు. NREGA, ఆడపిల్లలకు విద్య, ఆరోగ్య సంరక్షణకు నిధులను పెంచారు. ఎలక్ట్రిసిటీ కవరేజ్, జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ వంటి మౌలిక సదుపాయాల కార్యక్రమాలను విస్తృత పరిచారు. 1970, 1980 దశాబ్దాల్లో రూరల్ బ్యాంక్స్, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఐఎప్ఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు వంటి వాటికి సేవలు అందించారు. తద్వారా భారత్ను గర్వించేలా చేశారు.