JIO Finance: కొత్తగా జియో ఫైనాన్స్ కంపెనీ.. రిలయన్స్ షేర్ హోల్డర్లకు జాక్ పాట్..
JIO Finance: భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి ముఖేష్ అంబానీకి చెందిన మరో కంపెనీ మార్కెట్లో లిస్ట్ కానుంది. అవును ఇప్పటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కిందే ముఖేష్ అంబానీ అనేక వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు కంపెనీల డీమెర్జర్ ద్వారా వ్యాల్యూ లెవరేజ్ చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో భాగంగా జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థను తొలుత విడి కంపెనీగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తున్నారు.
పేరు మార్పు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఫైనాన్స్ సేవల సంస్థ రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్(RSIL)ను మెయిన్ కంపెనీ నుంచి విడదీయాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. దాని పేరును జియో ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్(JFSL)గా పేరు మార్చుతున్నట్లు ప్రకటించింది. ఇది కూడా భారత స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతుందని రిలయన్స్ గ్రూప్ స్పష్టం చేసింది.
పెట్టుబడుల బదిలీ..
RSIL అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని RBIలో నమోదు చేయబడిన ఫైనాన్స్ బ్యాంకింగ్ కంపెనీ. ఇది డిజిటల్ బ్యాంకింగ్, కన్జూమర్, ఇన్సూరెన్స్, పేమెంట్స్, లోన్స్ మొదలైన వాటిలో పని చేస్తోంది. ఇందులో ఉన్న పెట్టుబడులను మాతృసంస్థ బదిలీ చేస్తుంది.
ఇన్వెస్టర్లకు కొత్త షేర్లు..
రిలయన్స్ షేర్హోల్డర్లు కంపెనీలో కలిగి ఉన్న ప్రతి షేరుకు బదులుగా.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లను 1:1 నిష్పత్తిలో పొందుతారు. ఇది ఫుల్లీ పెయిడ్ అప్ షేర్లను రిలయన్స్ వెల్లడించింది. దీని ఫేస్ వ్యాల్సూ 10 రూపాయలని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. ఇది ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లను కలిగి ఉన్న వారికి బహుమతి అనే చెప్పుకోవచ్చు.
భారీ వ్యాపార ప్లాన్..
ప్రతి ఒక్కరికీ ఫైనాన్సియల్ సర్వీసెస్, రుణాల వంటివి ఈ రోజుల్లో చాలా అవసరం. క్రెడిట్ స్కోర్ ఆధారంగా లోన్స్ అందించటం అనే పాత పద్ధతి వల్ల.. బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోని చాలా మంది కస్టమర్లు వీటిని పొందలేక పోతున్నారు. అయితే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆన్ లైన్ కొనుగోళ్ల డేటా వినియోగించి సరైన కస్టమర్లు, వ్యాపారులను గుర్తించి వ్యాపారాన్ని విస్తరించాలని రిలయన్స్ భావిస్తోంది. కన్జూమర్ బిహేవియర్ అనాలసిస్ ద్వారా ఫైనాన్స్ వ్యాపారంలో విజయం సాధించాలని వేగంగా ముందుకు సాగుతోంది.