Recurring payment: డెబిట్/క్రెడిట్ కార్డుదారులకు గుడ్న్యూస్: ఆ లిమిట్ రెండింతలు పెంపు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరిగ్గా నెల రోజుల వ్యవధిలో మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది. రెపో రేట్ను మళ్లీ పెంచింది. ఈ సారి మరింత అధికంగా వడ్డించింది. ఇదివరకు 40 బేసిస్ పాయింట్ల మేర పెంచగా.. తాజాగా ఇప్పుడు ఈ సంఖ్యను 50కి పెంచింది. 50 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఫలితంగా రెపో రేట్ 4.9 శాతానికి పెరిగింది. దీని ప్రభావం వడ్డీ రేట్ల మీద విపరీతంగా పడింది. బ్యాంకులన్నీ తమ వడ్డీ రేట్లను మరోసారి సవరించడం ఖాయంగా కనిపిస్తోంది.
అదే సమయంలో మూడురోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ కమిటీ సమీక్షలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను శక్తికాంత దాస్ వెల్లడించారు. రికరింగ్ పేమెంట్స్ పరిమితిని పెంచినట్లు తెలిపారు. క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా జరిపే రికరింగ్ పేమెంట్స్ లిమిట్ ప్రస్తుతం 5,000 రూపాయల వరకు ఉంటోంది. ఇకపై ఇది రెండింతలు కానుంది. క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా 15,000 రూపాయల వరకు రికరింగ్ పేమెంట్స్ చెల్లించవచ్చు.
ఇప్పుడున్న ప్రాసెస్ ప్రకారం చూసుకుంటే డెబిట్/క్రెడిట్ కార్డులపై ఇ-మాండేట్ ఆధారిత రికరింగ్ చెల్లింపులకు ఉద్దేశించిన రిజిస్ట్రేషన్ సమయంలో అదనపు ప్రమాణీకరణ (అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్), ప్రీ-డెబిట్ నోటిఫికేషన్ పంపడం అవసరం. అన్ని ప్రధాన బ్యాంకులు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇప్పటివరకు 3,400 విదేశీ లావాదేవీలను కలుపుకొని ఈ ప్రాసెస్ కింద 6.25 కోట్లకు రిజిస్టర్ అయ్యాయి.
ప్రస్తుతం ఈ పరిమితి 5,000 రూపాయల వరకే ఉండటం వల్ల దీన్ని పెంచాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పలు విజ్ఞప్తులు అందాయి. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ పరిమితిని 15,000 రూపాయలకు పెంచినట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే రికరింగ్ పేమెంట్స్ మొత్తాన్ని పెంచాలంటూ స్టేక్ హోల్డర్స్ నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందాయని ఆయన వివరించారు.