ఇంటర్నెట్ లేకున్నా రూ.200 నుండి రూ.2000 వరకు డిజిటల్ పేమెంట్
బ్యాంకు ఖాతాదారులు ఇక ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్టివిటీ లేకుండా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను పెంచే క్రమంలో ఆఫ్ లైన్ ద్వారా చెల్లింపులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) సోమవారం సమ్మతి తెలిపింది. ఈ పద్ధతిలో రూ.200 వరకు ఒక్కో ట్రాన్సాక్షన్ జరుపుకోవచ్చునని పేర్కొంటూ ఈ రకంగా జరిగే మొత్తం ట్రాన్సాక్షన్స్కు రూ.2000 రోజువారీ పరిమితిని విధించింది. సాధనం ద్వారా వాడిన మొత్తాన్ని ఏఎఫ్ఏతో ఆన్లైన్లో భర్తీ చేయవలసి ఉంటుంది. ఇలాంటి ట్రాన్సాక్షన్స్కు ఓటీపీలు, పిన్, ఎస్సెమ్మెస్ వంటి అదనపు ఫ్యాక్టర్ అథెంటికేషన్(AFA) అవసరం లేదని ఆర్బీఐ తెలిపింది. ఇవి ఆఫ్లైన్లో జరగనున్నందున, ఎస్సెమ్మెస్ అలర్ట్, ఈమెయిల్ అలర్ట్ ఖాతాదారులకు ఆలస్యంగా వస్తాయని తెలిపింది. ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాల్లో, టెలిఫోన్ కనెక్టివిటీ అందుబాటులో లేని ప్రాంతాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సజావుగా సాగేందుకు, స్మార్ట్ ఫోన్ లేనివారు డిజిటల్ చెల్లింపులు చేసేందుకు ఈ ఆఫ్ లైన్ ప్రక్రియ ఉపకరిస్తుంది.
ప్రయోగాత్మక పరిశీలన
గ్రామీణ, చిన్న పట్టణాలు, ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి ఆర్బీఐ దీనిని అమల్లోకి తెస్తోంది. కొన్నిసార్లు నెట్ వర్క్ సరిగ్గా లేకుంటే డిజిటల్ చెల్లింపులు ఆలస్యమవుతాయి. ఒక్కోసారి ఖాతాదారు బ్యాంకు ఖాతాలో నగదు డెబిట్ అయినా వ్యాపారికి రావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్లైన్ ద్వారా డిజిటల్ చెల్లింపు పద్ధతిని ఆర్బీఐ తీసుకు వచ్చింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించారు.
కార్డ్స్, వ్యాలెట్, మొబైల్తో ట్రాన్సాక్షన్
2020 సెప్టెంబర్ నుండి 2021 జూన్ వరకు ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో పరిశీలించారు. అలాగే, ఒక్కో ట్రాన్సాక్షన్కు రూ.200 మించకుండా, మొత్తం వ్యాల్యూ రూ.2000 వరకు చెల్లింపు, అనుమతిస్తూ విధివిధానాలను ఖరారు చేశారు. ఈ ఆఫ్ లైన్ ట్రాన్సాక్షన్స్ను కార్డ్స్, వ్యాలెట్, మొబైల్ తదితరాలతో చేసేందుకు వీలుంది. ఈ ట్రాన్సాక్షన్స్ ఏర్పడే వివాదాలు అంబుడ్స్మెన్ పరిధిలోకి వస్తాయని తెలిపింది ఆర్బీఐ.
ఒకేసారి ప్రాసెస్
ఈ ఆఫ్లైన్ చెల్లింపులను ఫేస్ టు ఫేస్ చేయాలి. పాయింట్ ఆఫ్ సేల్ తరహాలో ఉండే ప్రత్యేక మిషన్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు. రోజువారీ ట్రాన్సాక్షన్స్ అన్నీ పూర్తయ్యాక, వ్యాపారి ఈ యంత్రాన్ని నెట్కు అనుసంధానం చేస్తే ఆ చెల్లింపులన్నీ ఒకేసారి ప్రాసెస్ అవుతాయి. వాయిస్ బేస్డ్ చెల్లింపులు, ఐవీఆర్ ద్వారా సూచనలు ఇచ్చి, చెల్లింపులను చేయవచ్చు. పేమెంట్ సిస్టం ఆపరేటర్లు, పేమెంట్ సిస్టం పార్టిసిపెంట్స్ ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచించింది.