IRCTC: టికెట్ బుకింగ్ వెబ్సైట్ లాగిన్ చేయాలంటే: గుర్తింపు కార్డులతో లింక్
న్యూఢిల్లీ: రైలు టికెట్లు బుకింగ్ కోసం ఇదివరకు ప్రయాణికులు గంటల కొద్దీ కౌంటర్ల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉండేది. దీన్ని నివారించడానికి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చిన తరువాత ఆ పరిస్థితి తప్పింది. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అప్గ్రేడ్ చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ. ఫలితంగా- ఉన్నచోటే స్మార్ట్ఫోన్ల ద్వారా రైల్వే టికెట్లను నిమిషాల మీద బుక్ చేసుకునే వెసలుబాటును ప్రయాణికులకు కల్పించింది.
వన్ నేషన్..వన్ పెట్రో రేట్: దినదినగండం: మళ్లీ పెట్రోల్, డీజిల్ రేట్లు భగ్గు
ఐడెంటిటీ కార్డులతో వెబ్సైట్ లింక్..
దేశంలో అత్యధిక మంది యూజర్లు వినియోగించే వెబ్సైట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీన్ని కూడా దుర్వినియోగం చేస్తోన్నారు కొందరు ఘనులు. టికెట్లను బ్లాక్లో విక్రయించుకోవడానికి ఈ సౌకర్యాన్ని కూడా వదలట్లేదు. దీన్ని నివారించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త ప్రయోగానికి పూనుకుంది. టికెట్లను బుక్ చేసుకోదలిచిన ప్రయాణికుల గుర్తింపు కార్డులతో ఐఆర్సీటీసీ వెబ్సైట్ను లింక్ చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన చర్యలను ప్రారంభించామని కూడా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ తెలిపారు.
పాన్, ఆధార్, పాస్పోర్ట్..
టికెట్ల బుకింగ్ వ్యవస్థ దురుపయోగమౌతోందనే సమాచారం అందిందని, దీన్ని నివారించడానికి అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రయాణికులు తమ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ లేదా ఏదైనా ఇతర గుర్తింపు కార్డుతో వెబ్సైట్కు లింక్ చేసుకునే వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు అరుణ్ కుమార్ తెలిపారు. వెబ్సైట్లో లాగిన్ అవ్వాలంటే- ప్రయాణికులు తమ గుర్తింపు కార్డులతో లింక్ చేసుకోవడం తప్పనిసరి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
నకిలీల బెడద
ఈ దిశగా తాము చర్యలు తీసుకుంటున్నామని, దీనికి సంబంధించిన నెట్వర్క్ను రూపొందించుకుంటున్నామని అన్నారు. దీనికోసం ఆధార్ విభాగం అధికారులతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని ఆర్పీఎఫ్ డీజీ స్పష్టం చేశారు. నకిలీ టికెట్ల కొనుగోలుదారులను గుర్తించడానికి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను రూపొందించినట్లు అరుణ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది మే నాటికి 14,257 మంది నకిలీలను అరెస్ట్ చేసినట్లు కూడా చెప్పారు. వారు బుక్ చేసిన నకిలీ టికెట్ల విలువ 28.34 కోట్ల రూపాయలని పేర్కొన్నారు.
ప్రయాణికుల భద్రతే
రైల్ సురక్షా యాప్ ద్వారా ప్రయాణికులకు మరింత భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనికోసం ప్రభుత్వ రైల్వే పోలీసుల (జీపీఎఫ్) సహకారాన్ని తీసుకుంటున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా 6,049 రైల్వే స్టేషన్లు, అన్ని పాసింజర్ రైళ్ల బోగీల్లో సీసీటీవీలను అమర్చే ప్రక్రియను వేగవంతం చేశామని చెప్పారు. ప్రయాణికులకు భద్రత కల్పించడానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, దీనికోసం టెక్నాలజీని వినియోగించుకుంటున్నామని ఆర్పీఎఫ్ డీజీ పేర్కొన్నారు.