మరిన్ని బ్యాంకుల ప్రైవేటీకరణ- కార్మికులే సవాల్- కేంద్రం పక్కా ప్లాన్
50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ హయాంలో మన దేశంలో బ్యాంకుల జాతీయీకరణ జరిగింది. అప్పట్లో దేశ ప్రయోజనాలతో పాటు బ్యాంకులపై సగటు ఖాతాదారుల్లో నమ్మకం కల్పించడమే లక్ష్యంగా ఈ మహాయజ్ఞం జరిగింది. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్ధితుల్లో బ్యాంకులు పోగేసిన నిరర్ధక ఆస్తుల గండం నుంచి బయటపడేందుకు కేంద్రం ప్రైవేటీకరణ మంత్రం జపిస్తోంది. ఒక్కొక్కటిగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తూ వెళుతోంది. కార్మిక సంఘాల రూపంలో ఎదురవుతున్న సవాళ్లను కూడా కేంద్రం అధిగమిస్తోంది. దీంతో దేశంలో బ్యాంకింగ్ రంగం రూపురేఖలు వేగంగా మారిపోతున్నాయి.
డిజిటల్ పేమెంట్స్ భద్రత కోసం RBI మాస్టర్ డైరెక్షన్
జాతీయీకరణ నుంచి ప్రైవేటీకరణ దిశగా బ్యాంకులు
దేశంలో విస్తృత ప్రజా ప్రయోజనాలతో పాటు బ్యాంకులపై సగటు జనంలో నమ్మకం కల్పించే దిశగా 50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణకు తలుపులు తెలిచారు. అప్పట్లో జరిగిన బ్యాంకు జాతీయీకరణ భారత ఆర్ధిక రంగానికే ఊపిరిలూదింది. అదే సమయంలో సగటు ఖాతాదారుల్లో బ్యాంకులపై నమ్మకం కూడా పెంచింది. కానీ ఇప్పుడు పరిస్ధితి మారిపోయింది. కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా పెద్దల రూపంలో ఉన్న గద్దలకు రుణాలు ఇచ్చిన అవే బ్యాంకులు చివరికి ప్రభుత్వానికి గుది బండగా మారిపోయాయి. తప్పనిసరిగా వాటిని ప్రైవేటీకరణ చేయాల్సిన పరిస్ధితుల్లోకి వచ్చేశాయి.
ప్రైవేటీకరణకు కేంద్రం వేగంగా అడుగులు
ప్రస్తుతం దేశంలో ఉన్న పది జాతీయ బ్యాంకుల్లో కేంద్రానికి 70 శాతం వాటా ఉంది. మరో మూడు బ్యాంకుల్లో 90 శాతం వాటా ఉంది. వీటిలో తన వాటాను భారీగా తగ్గించుకోవడం ద్వారా ప్రైవేటీకరణకు తలుపులు తెరిచేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. తద్వారా ఆయా బ్యాంకులకు భారీగా మూలధనం సమకూరడంతో పాటు నిర్వహణా సామర్ధ్యం కూడా పెరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. దశాబ్దాలుగా ప్రభుత్వ రంగంలో ఉన్న ఈ బ్యాంకులన్నీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో, అలాగే ప్రైవేటు బ్యాంకులు అడుగుపెట్టని గ్రామాల్లో సేవలందించాయి. కానీ నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు చేతులెత్తేశాయి.
దీంతో ప్రైవేటీకరణ తప్పనిసరిగా మారిపోయింది.
50 శాతం కంటే తక్కువకు ప్రభుత్వ వాటా
2014లో ఆర్బీఐ నియమించిన పీజే నాయక్ ప్యానెల్ బ్యాంకులు నష్టాల నుంచి బయటపడేందుకు రండు మార్గాలు సూచించింది. ఒకటి ప్రైవేటీకరణ, రెండు భవిష్యత్ నష్టాలను ఎదుర్కొనేందుకు తగిన పోటీ వాతావరణం కల్పించడం. వీటిలో విలీనంతో పాటు బ్యాంకింగ్ నిర్వహణా విధానాల్లో సమగ్ర మార్పులు కూడా ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వం ఈ బ్యాంకుల్లో తన వాటాను 50 శాతం కంటే తక్కువకు తగ్గించుకోవాలని సూచించింది. దీని ప్రకారం చూస్తే ప్రైవేటు వ్యక్తులు, సంస్ధల చేతుల్లోకి బ్యాంకులు వెళ్లడం ఖాయంగా కనిపిస్తకోంది. ఇప్పుడు కేంద్రం చేస్తుంది కూడా అదే.
ప్రైవేటీకరణపై కార్మికుల అభ్యంతరాలు
బ్యాంకుల్లో వాటాల ఉపసంహరణ ద్వారా ప్రైవేటీకరణకు కేంద్రం వేస్తున్న అడుగులను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయానికి నిరసనగా మార్చి 15, 16 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇందులో దాదాపు పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు, కార్మికులు పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత కూడా కేంద్రం వెనక్కి తగ్గకపోతే నిరవధిక దీక్షలకు సైతం సిద్ధమవుతున్నారు. బ్యాంకుల నష్టాలకు పరిష్కారంగా కేంద్రం చెబుతున్న ప్రైవేటీకరణ హేతుబద్దతను కార్మికసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
దీంతో కేంద్రం కూడా దీనికి కౌంటర్ వ్యూహం సిద్ధం చేసింది.
బ్యాడ్ బ్యాంక్తో వ్యతిరేకత అధిగమించే వ్యూహం
కార్మికుల వ్యతిరేకత నేపథ్యంలో ప్రైవేటీకరణపై ముందుకెళ్లే్ందుకు కేంద్రం బ్యాడ్ బ్యాంక్ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. మొన్నటి బడ్జెట్లో ప్రతిపాదించిన బ్యాడ్ బ్యాంక్ అమలుతో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను సెటిల్ చేయాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఓసారి బ్యాలెన్స్ షీట్లు సక్రమంగా ఉంటే బ్యాంకులపై నమ్మకం పెరిగి వాస్తవ రుణగ్రహీతలు పెరుగుతారని కేంద్రం అంచనా వేస్తోంది. అదే సమయంలో బ్యాంకులను కొనుగోలు చేసేందుకు ప్రైవేటు వ్యక్తులు, సంస్ధలు ఆసక్తి చూపుతాయని కేంద్రం భావిస్తోంది. దీంతో కార్మికుల వ్యతిరేకతను అధిగమించి, వారిని ఎలాగైనా ఒప్పించి బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.