2020లో 4-5 మినీ బడ్జెట్లు: ప్రధాని మోడీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (జనవరి 29) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ దశాబ్దానికి ఇది తొలి బడ్జెట్ అని, ఈ రోజు మొదటి సెషన్ అని, దేశ అత్యుత్తమ భవిష్యత్తుకు ఈ దశాబ్దం ఎంతో కీలకమని ప్రధాని అన్నారు.
మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేయడానికి ఎంతో మంచి అవకాశాలు వస్తున్నాయని, వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ అంశాలపై సమావేశాలు కొనసాగాలన్నారు.
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు.. చదవండి
భారత దేశ చరిత్రలో తొలిసారి గత ఏడాది ఆర్థికమంత్రి ప్యాకేజీల రూపంలో నాలుగైదు మినీ బడ్జెట్లు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.30 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలుమార్లు ప్యాకేజీని ప్రకటించారు. దీనిని మోడీ గుర్తు చేస్తూ 2020లో మినీ బడ్జెట్లు ప్రవేశ పెట్టామన్నారు.
ఈ శతాబ్దానికి ఇది తొలి సమావేశం అన్నారు. ఈ దశాబ్దాన్ని భారత్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పార్లమెంటులో చర్చలు జరగాలన్నారు. కాగా, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు.