ప్రత్యక్ష పన్నులపై కేంద్రం కీలకనిర్ణయం, సరికొత్త ట్యాక్స్ ప్లాట్ఫాం
న్యూఢిల్లీ: ట్యాక్స్ చెల్లింపుదారుల్ని ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కొత్త పన్ను పథకాన్ని ప్రారంభించారు. పారదర్శక పన్ను విధానం - నిజాయితీపరులకు గౌరవం అనే పేరుతో ట్యాక్స్ పేయర్ చార్టర్ను తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. దేశంలో ప్రత్యక్ష పన్నుల సంస్కరణలో మరో ముందడుగు పడిందన్నారు. సంస్కరణల ఆలోచనా విధానం మారిందని చెప్పారు. త్వరితగతిన సేవలు పొందేలా ట్యాక్స్ పేయర్ చార్టర్ను తీసుకు వచ్చింది కేంద్రం.
నిజాయితీగా పన్ను చెల్లించే వారికోసం 'ట్రాన్స్పరెంట్' స్కీం.. 'ట్యాక్స్పేయర్ చార్టర్'
ఈ కొత్త ప్లాట్ఫాం డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్(DIN) ఉద్దేశ్యం అధికార సమాచార మార్పిడిలో మరింత పారదర్శకత తీసుకు రావడం. ట్యాక్స్ పేయర్స్కు గౌరవం ఇవ్వడం. పన్ను సంస్కరణల్లో భాగంగా ఈ రోజు మరో కీలక అడుగు వేసినట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. పారదర్శక పన్ను విధానం - నిజాయితీపరులకు గౌరవం ప్లాట్ఫాం ద్వారా ఫేస్లెస్ అసెస్మెంట్, ఫేస్లెస్ అప్పీల్, ట్యాక్స్పేయర్ చార్టర్ ఉంది.
ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్నుల విధానంలో మరిన్ని సంస్కరణలు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక వేదిక ద్వారా సులువుగా ఫిర్యాదులు చేయవచ్చునని చెప్పారు. నిజాయితీగా పన్నులు చెల్లించే ఈ ప్లాట్ఫాం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పన్నుల సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరమన్నారు. పన్ను చెల్లింపుదారులు పెరిగేందుకు దోహదపడుతుందన్నారు. పారదర్శక పన్ను-నిజాయితీపరులకు గౌరవం స్కీం దేశంలోని పన్నుల వ్యవస్థను మరింత సరళం చేసేందుకు బలం చేకూరుస్తుందన్నారు.
ఫేస్లెస్ అప్పీల్ సెప్టెంబర్ 25వ తేదీ నుండి వర్తిస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. అయితే ఫేస్లెస్ అసెస్మెంట్, ట్యాక్స్పేయర్ చార్టర్ మాత్రం ఈ రోజు నుండి అందుబాటులోకి వస్తాయన్నారు. నిజాయితీగల పన్ను చెల్లింపుదారుడిని గౌరవించడం దేశ నిర్మాణానికి సహాయపడుతుందని, ఈ ప్లాట్ఫాంను ప్రారంభించడం కనీస మినిమం గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్ వైపు మరో అడుగు అన్నారు. సంక్లిష్ట పన్ను విధానం వల్ల ఇబ్బందులు ఉంటాయని, అందుకే స్పష్టమైన విధానాల ద్వారా ట్యాక్స్ పేయర్స్పై భారం తగ్గించడమే లక్ష్యమన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... ట్యాక్సేషన్ అడ్మినిస్ట్రేషన్లో ఇదో మైలురాయి రోజు అన్నారు.